షాకింగ్: ఫలితాలపై కేసీఆర్కు అనుమానం ఉందా, ఖానాపూర్లో అలాంటి కామెంట్ ఎందుకు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ, ఇతర పార్టీలు, అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా గెలుపుపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ధీమాగా ఉన్నాయి. ఎన్నికల ప్రచార వేడి తారాస్థాయికి చేరుకుంది.
ఖానాపూర్లో తెరాసకు 'డబుల్' షాక్: పూర్తిగా నింపని రేఖానాయక్, ఓ కాలమ్ ఖాళీ
కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి నెల పదిహేను రోజులు దాటింది. అసెంబ్లీ రద్దయిన కొద్ది రోజుల్లోనే తెరాస ప్రచారం ప్రారంభమైంది. కానీ మహాకూటమిలో సీట్లు, నియోజకవర్గాల లెక్క తెగకపోవడం వల్ల నామినేషన్ రోజు వరకు కూడా ఎడతెగని సంప్రదింపులు కొనసాగాయి. కూటమిలోని అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ ఇప్పుడు మహాకూటమి కూడా ప్రచారంలో దూసుకెళ్తోంది.
ప్రచారంలో కేసీఆర్ దూకుడు
ఇటీవలి వరకు తెరాస అధికారంలోకి వస్తాయని కొన్ని సర్వేలు, మహాకూటమికి అవకాశం ఉందని మరికొన్ని సర్వేలు వెల్లడించాయి. అయితే ఈ పదిహేను రోజులు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కూడా ఈ నెల 19వ తేదీ నుంచి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు మూడు నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటూ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.
గెలుపుపై తెరాస ఆశలు సన్నగిల్లుతున్నాయా?
కేసీఆర్ మళ్లీ కచ్చితంగా గెలుస్తామనే ధీమాతోనే అసెంబ్లీని రద్దు చేశారని చెప్పవచ్చు. మహాకూటమిలో సీట్ల లెక్క తేలకపోవడంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు సెటైర్లు కూడా వేశారు. వాళ్లు సీట్లు పంచుకునే వరకు టీఆర్ఎస్ స్వీట్లు పంచుకుంటుందని వ్యాఖ్యలు చేశారు. అయితే మహాకూటమి ప్రచార రంగంలోకి దిగిన తర్వాత తెరాసలో గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్నాయా? అనే చర్చ సాగుతోంది.
తెరాసకు తడబాడు
ఓ వైపు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంజీవ రావు తెరాసను వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పలువురు తెరాస అసంతృప్తులు కూడా తెరాస తిరిగి గెలవదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. క్యాడర్తో పాటు అధిష్టానానికి కూడా గెలుపు భయం పట్టుకుందా అనే చర్చ సాగుతోంది. దీంతో ఇప్పటి వరకు పూర్తి విశ్వాసంతో ఉన్న తెరాస నేతలు తడబడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఓడిపోతే నాకు వచ్చే నష్టమేమీ లేదు
తాజాగా, గురువారం కేసీఆర్ ఖానాపూర్ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేడర్లోను కలకలం రేపాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో మీరు అధికారం ఇస్తే పని చేస్తానని, లేదంటే ఇంట్లో కూర్చొని, హాయిగా విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ చెప్పారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో తెరాస ఓడిపోతే తనకు వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదని, ఇంట్లో రెస్ట్ తీసుకుంటానని చెప్పడం ద్వారా ప్రజలకే నష్టమనే అభిప్రాయం కలిగిస్తున్నారు.
టార్గెట్ చంద్రబాబు
అదే సమయంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చంద్రబాబును బూచీగా చూపిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చేతికి అధికారం వెళ్తుందని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏపీ నేతలను తిట్టి సెంటిమెంట్తో లబ్ధి పొందినట్లుగానే, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును చూపించి మళ్లీ లబ్ధి పొందాలని చూస్తున్నారని అంటున్నారు.