ఏపీ,తెలంగాణా రాజకీయాల్లోకి జయప్రద ఎంట్రీ; ఆ స్థానంపై గురి; ఈసారైనా కోరిక ఫలిస్తుందా?
బిజెపి సీనియర్ రాజకీయ నాయకురాలు, సినీనటి జయప్రద తెలుగు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తాను ఆసక్తితో ఉన్నట్టు సినీ నటి జయప్రద వెల్లడించారు. మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు హైదరాబాద్ లో జరిగిన ఒక క్లినిక్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తాను తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట చెప్పారు. అయితే ఆమె ఏపీ రాజకీయాలవైపే ప్రధానంగా ఆసక్తితో ఉన్నట్టు సమాచారం.
తెలుగురాష్ట్రాల ప్రజలకు సేవ చెయ్యాలని ఉంది: జయప్రద
తాను చాలా కాలం క్రితమే జాతీయ రాజకీయాల్లో యాక్టివ్గా మారానని గుర్తుచేసుకున్న జయప్రద, ఇప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 2019లో బీజేపీలో చేరిన జయప్రద.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పార్టీ క్యాడర్లో ఉన్నందున తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరే విషయంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి రావడానికి తనను అనుమతించాలని బీజేపీ అధిష్టానాన్ని అభ్యర్థిస్తానని నటి జయప్రద చెప్పారు.
రాజమండ్రికి చెందిన జయప్రద .. టీడీపీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన జయప్రద తన గత 28 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పార్టీలు మారారు. 1994లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టిఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ (టిడిపి)లో చేరడం ద్వారా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలను చంద్రబాబు చేతిలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు 1996లో జయప్రదను రాజ్యసభ సభ్యురాలిగా మరియు పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా చేశారు. చంద్రబాబు నాయుడు మరో నటి రోజాను మహిళా విభాగం చీఫ్గా చేయడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి.
తెలుగు రాజకీయాలపై చాలా కాలం నుండి ఆసక్తితో ఉన్న జయప్రద
ఆ తర్వాత అమర్ సింగ్, ములాయం సింగ్ ఆహ్వానం మేరకు ఆమె సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఆమె 2004లో రాంపూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మళ్ళీ 2009లో తిరిగి ఎన్నికయ్యారు. ములాయం సింగ్పై తిరుగుబాటు చేసిన తర్వాత జయప్రద అమర్ సింగ్ పక్షాన నిలిచారు. 2010లో ఎస్పీ నుంచి బహిష్కరించబడిన ఆమె అమర్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచ్లో చేరారు. అయితే, ఉత్తరప్రదేశ్లో పార్టీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. దీంతో 2013లో ఆమె తిరిగి టీడీపీలోకి వస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారని ఆమె ఈ విషయాన్ని తోసిపుచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సమయంలో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని ఊహాగానాలు వచ్చాయి.
రాజమండ్రి నుండి టికెట్ కోసం ప్రయత్నించిన జయప్రద.. ఇప్పటికీ రాజమండ్రిపై ఆసక్తి
2014లో అమర్ సింగ్తో పాటు జయప్రద అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి)లో చేరారు. ఆమె ఆర్ ఎల్ డి అభ్యర్థిగా బిజ్నోర్ నియోజకవర్గం నుండి లోక్సభకు పోటీ చేసినప్పటికీ నాల్గవ స్థానంలో నిలిచింది. అయితే, 2019 లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె బీజేపీలో చేరారు. 1998, 1999లో బీజేపీ గెలిచిన రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపవచ్చని ఊహాగానాలు వినిపించాయి.అయితే బిజెపి ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు.2024 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు జయప్రద ఆసక్తి చూపుతున్నట్లు ఆమె తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో ఒకరిగా జయప్రద
రాజమండ్రిలో ఆమె చిన్న వయస్సులోనే తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు సత్యజిత్ రే ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళగా అభివర్ణించిన జయప్రద 1970లలో తెలుగు చిత్రాలలో నటించడం ప్రారంభించి దక్షిణాది చిత్ర పరిశ్రమలోని ప్రముఖ మహిళల్లో ఒకరిగా ఎదిగారు. ఆమె 1980లలో హిందీ సినిమాల్లోకి ప్రవేశించారు. అమితాబ్ బచ్చన్ మరియు జితేంద్రతో సహా పలువురు ప్రముఖ నటులతో కలిసి పని చేశారు. మూడు దశాబ్దాల సినీ జీవితంలో, జయప్రద తమిళం, కన్నడ, మరాఠీ మరియు బెంగాలీతో సహా ఎనిమిది భాషలలో 300 చిత్రాలలో నటించారు.