చర్చలు విఫలం: హామీలేకపోవడంతో జూడాల సమ్మె కొనసాగింపు, కేసీఆర్కు ధైర్యం లేదా? అంటూ బండి
హైదరాబాద్: తెలంగాణ వైద్యవిద్య సంచాలకులు(డీఎంఈ) రమేష్ రెడ్డితో జూనియర్ డాక్టర్ల చర్చలు ముగిశాయి. అయితే, ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని జూనియర్ డాక్టర్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామని తేల్చిచెప్పారు.

జూనియర్ డాక్టర్ల ఆవేదన
ప్రస్తుతానికి తమ సమ్మె కొనసాగుతుందన్నారు. విధుల్లో పాల్గొనే విషయంపై చర్చిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. కరోనాతో చనిపోతే ఎక్స్గ్రేషియా ఇవ్వలేమని డీఎంఈ చెప్పారని వారు తెలిపారు. 10 శాతం కోవిడ్ ఇన్సెంటివ్లు ఇవ్వడం కూడా కుదరదని డీఎంఈ చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేటీఆర్ ట్వీట్తో సమ్మె విరమించాలనుకున్నా.. హామీ లేకపోవడంతో..
అయితే, జనవరి 1 నుంచి లేదా మే నుంచే 15 శాతం పే హైక్ ఇస్తామని తెలిపారని, అయితే, ఈ మేరకు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లో చేరతామని చెప్పినట్లు వెల్లడించారు. కానీ, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చూసి సమ్మె విరమించాలని అనుకున్నామని, కానీ, డీఎంఈతో చర్చల్లో తమకు సరైన హామీ రాకపోవడంతో సమ్మెను కొనసాగించాలని నిర్ణయించినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు.

కేసీఆర్కు ఆ ధైర్యం లేదా?
ఇది ఇలావుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సరైన సమయంలో స్పందించి ఉంటే.. జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు సమ్మె చేసేవారే కాదని అన్నారు. సీఎంకి డాక్టర్లను పిలిచి చర్చలు జరిపే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు.
Recommended Video

కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న బండి సంజయ్
వైద్య సిబ్బందిపై ఒత్తిడి పడుతుంటే ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. సమ్మెకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన ఎంతమంది సిబ్బందికి ఎక్స్గ్రేషియా చెల్లించారో సమాధానం చెప్పాలన్నారు. అత్యవసర సేవలకు భంగం కలిగించకుండా వైద్యులు విధులు నిర్వరిస్తే వారిపక్షన నిలబడి బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు బీజేపీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, అయితే, కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మె సరికాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications