చైనాలో కెసిఆర్ బిజీ: సెల్కాన్, మకేనాలతో ఒప్పందం, సిటీ వానపై ఆరా
షాంఘై: పెట్టుబడులను రాబట్టే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చైనాలో బిజీగా ఉన్నారు. గురువారంనాడు ఆయన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం, సిఐఐ షాంఘైలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సదస్సుకు 65 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై కెసిఆర్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సెల్కాన్, మకేనా ఎంఓయులు కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు సెల్కాన్, మకేనాతో ఈ ఒప్పందం కుదిరింది.
చెత్త నుంచి ఇంధనం ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టులకు ఆర్థిక సాయమందించాలని కెసిఆర్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అధ్యక్షుడు కేవీ కామత్, ఉపాధ్యక్షుడు జియాన్జులను కోరారు. కెసిఆర్ విజ్ఞప్తికి న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
అదే సమయంలో వ్యర్థ పదార్థాలతో విద్యుత్ ఉత్పత్తి, నీటి పారుదల ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంక్ ప్రతినిధులను కోరారు.
హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితిని కెసిఆర్ చైనా నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రెండు రోజులుగా హైదరాబాదులో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్రేటర్ మంత్రులు మహమూద్ అలీ, నాయని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు గురువారం సమావేశమై నగరంలోని పరిస్థితిని సమీక్షించారు.
వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు. రెస్క్యూ టీమ్లు, ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.