బీజేపీకి వరుస షాకులు ఇస్తున్న కేసీఆర్: మోడీ వచ్చేరోజే హైదరాబాద్ లో భారీర్యాలీకి ప్లాన్!!
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఈసారి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని నిర్ణయించి, జూలై 2,3 తేదీలలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతోపాటు వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా, బిజెపికి భారీ మైలేజ్ తీసుకురావడానికి తెలంగాణ బిజెపి నేతలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కెసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పనైపోయిందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
Recommended Video
జులై 2 న హైదరాబాద్ కు రానున్న మోడీ .. భారీ ర్యాలీకి బీజేపీ ప్లాన్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడం కోసం హైదరాబాద్ కు జూలై 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని బిజెపి శ్రేణులు నిర్ణయించాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ మూడవ తేదీన నిర్వహించే బహిరంగ సభకు, పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి, 5 లక్షల మంది జనాన్ని తరలించాలని బిజెపి నేతలు నిర్ణయించారు.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న బిజెపి నేతలు తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఈ సమావేశాల తర్వాత తెలంగాణలో బీజేపీ బలం మరింత పుంజుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యం అవుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు.
బీజేపీకి షాక్ ఇచ్చే పనిలో టీఆర్ఎస్.. ఇప్పటికే హోర్డింగ్ లతో హంగామా
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో దూకుడు చూపిస్తున్న బిజెపికి చెక్ పెట్టడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలోని అన్ని హోర్డింగ్ పాయింట్ లను తమ అధీనంలోకి తీసుకున్నారు. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా గులాబీ హోర్డింగ్స్, బ్యానర్లను పెట్టి హంగామా చేస్తున్నారు. మోడీ పర్యటన నాటికి హైదరాబాద్ అంతా గులాబీ మయం చెయ్యాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇక ఇదే క్రమంలో బీజేపీకి షాక్ ఇవ్వడానికి మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది టిఆర్ఎస్.
జులై 2నే యశ్వంత్ సిన్హా రాక.. భారీ ర్యాలీకి ప్లాన్ చేసిన కెసీఆర్
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటించే రోజే, నగరంలో తమ సత్తా తెలిసేలా భారీ ర్యాలీ నిర్వహించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జూలై 2వ తేదీన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ, భారీ ర్యాలీ నిర్వహించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. యశ్వంత్ సిన్హా రాక నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ కు భారీ ర్యాలీ నిర్వహించడానికి టిఆర్ఎస్ వర్గాలు సమాయత్తమవుతున్నాయి.
ఎయిర్ పోర్ట్ నుండి జలవిహార్ వరకు భారీ ర్యాలీతో ,.. బీజేపీకి షాక్ ఇవ్వనున్న టీఆర్ఎస్
ఎయిర్ పోర్ట్ నుండి జలవిహార్ వరకు దారిపొడుగునా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నింపి హంగామా చేయాలని భావిస్తున్నారు. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో, బిజెపి హంగామా కు చెక్ పెట్టడం కోసం, యశ్వంత్ సిన్హా రాకపై భారీ ర్యాలీ టిఆర్ఎస్ పార్టీ నిర్వహించనుందని తెలుస్తుంది. మరి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపధ్యంలో రసవత్తరంగా మారిన ఈ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో.. ఏ పార్టీకి మైలేజ్ తెచ్చి పెడతాయో వేచి చూడాలి.