ఉత్తమ్ ఎఫెక్ట్: బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్, టిఆర్ఎస్కు దూరమైన కారణమిదే
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకనేతలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 17వ, తేదిన కోమటిరెడ్డి సోదరులు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో సమావేశం కానున్నారనే సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకొంటున్న పరిణామాలు కోమటిరెడ్డి సోదరులు పార్టీని వీడి వెళ్లనున్నారనే సంకేతలు ఇస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
2019 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉత్తమ్కుమార్రెడ్డి కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కుంతియా ప్రకటించారు. అయితే కోమటిరెడ్డి సోదరులు మాత్రం పిసీసీ పదవిపై ఆశతో ఉన్నారు.
అయితే ఈ విషయమై కోమటిరెడ్డి సోదరులు మాత్రం పిసీసీ చీఫ్ పదవిపై అధిష్టానాన్ని కలవాలనే ఆలోచనలతో ఉన్నారు. కానీ, ఇటీవల కాంగ్రెస్ పార్టీ శిక్షణ శిబిరంలో ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రసంగించే సమయంలో కోమటిరెడ్డి సోదరులు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ కుంతియా కోమటిరెడ్డి సోదరుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్
సిఎల్పీ ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని వీడుతారానే ప్రచారం సాగుతోంది. బిజెపిలో చేరేందుకు కోమటిరెడ్డి సోదరులు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం కూడ ఉంది. కొంత కాలం క్రితం నుండే బిజెపి కీలక నేతలు కోమటిరెడ్డి సోదరులతో చర్చించారని ప్రచారం కూడ బిజెపి వర్గాల్లో ఉంది. కోమటిరెడ్డి లాంటి నేతలు తమ పార్టీలో చేరడం వల్ల రాజకీయంగా తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతోందనే భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో తమను ఇబ్బంది పెడుతున్నారనే కారణంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరేందుకు సిద్దమౌతున్నారని సమాచారం.
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో సమావేశం
ఈ నెల 17వ, తేదిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కోమటిరెడ్డి బ్రదర్స్ కలవనున్నారనే ప్రచారం బిజెపి వర్గాల్లో ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను రాజ్నాథ్సింగ్ హైద్రాబాద్కు రానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోమటిరెడ్డి సోదరులు రాజ్నాథ్తో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉత్తమ్తో విభేదాలే కారణమా
టిపిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో కోమటిరెడ్డి సోదరులకు విభేదాలున్నాయి. రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్సీగా పోటీచేసిన సమయంలో ఉత్తమ్కుమార్రెడ్డి వ్యతిరేకంగా పనిచేశారని కోమటిరెడ్డి సోదరులు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే కొంతకాలం తర్వాత వారి మధ్య సఖ్యత కుదిరినట్టు కన్పించింది. ఉత్తమ్, కోమిరెడ్డి సోదరులు కలిసి మిర్యాలగూడలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకొన్నారు. అయితే పిసీసీ చీఫ్ పదవిపై కోమటిరెడ్డి సోదరులు ఆశతో ఉన్నారు.
గుత్తా వల్లే టిఆర్ఎస్లో చేరలేదా?
కోమటిరెడ్డి సోదరులు ఏడాదిన్నర క్రితం టిఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. అయితే అదే సమయంలో టిఆర్ఎస్పై ఒంటికాలి మీద లేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అనుహ్యంగా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. అయితే గుత్తా సుఖేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరడం వల్లే కోమటిరెడ్డి సోదరులు టిఆర్ఎస్లో చేరలేదనే ప్రచారం కూడ లేకపోలేదు. నల్గొండ జిల్లాలో టిఆర్ఎస్ను బలోపేతం చేసేందుకుగాను గుత్తా సుఖేందర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వనించారు కెసిఆర్. ఈ మేరకు ఆయన టిఆర్ఎస్లో చేరారు. గుత్తా సుఖేందర్రెడ్డి టిఆర్ఎస్లో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీలోనే కోమటిరెడ్డి సోదరులు ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.
కాంగ్రెస్ నేతలకు బిజెపి వల
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకనేతలకు బిజెపి వల వేస్తోంది. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఓంటరిగా పోటీచేస్తోంది. అయితే తెలంగాణలో బిజెపికి నామమాత్రంగానే బలం ఉంది. ఈ తరుణంలో ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను ఆకర్షించడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవచ్చని బిజెపి నేతలు భావిస్తున్నారు.