కాంగ్రెస్ లో గ్రూపులు.. 25 మందికి టికెట్లు ఇప్పించా..! సంచలనం రేపుతున్న కోమటిరెడ్డి కామెంట్స్
హైదరాబాద్ : ఏ పార్టీలో చూసినా ఇంటర్నల్ వార్ సహజమే. కాంగ్రెస్ లో అయితే అది కాస్తా ఎక్కువని చెప్పొచ్చు. ఇక ఆ పార్టీలో గ్రూపుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. లీడర్లు ఎవరికివారుగా గ్రూపులు మేనేజ్ చేస్తారనేది బహిరంగ రహస్యం. అయితే ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా గ్రూపులు లేవంటూ ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. టికెట్ల పంపిణీలో పారదర్శకత ఉంటుందని, ఎలాంటి అనుమానాలకు తావు లేదని తేల్చి చెప్పింది. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ టికెట్లు ఖరారు చేస్తామని తెలిపింది. అదలావుంటే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్ సంచలనం సృష్టిస్తోంది.
ఒకరికే టికెట్ ఇప్పించుకోవడం గగనంగా మారిన కాంగ్రెస్ పార్టీలో ఏకంగా 25 మందికి టికెట్లు ఇప్పించానంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్ ప్రస్తుతం చర్చానీయాంశమైంది. మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజగోపాల్ రెడ్డి.. తన పంతం నెగ్గిందన్నట్లుగా చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గ్రూపులే లేవన్నారు.. 25మందికి టికెట్లా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పెద్దలు అందుకనుగుణంగా వ్యూహరచన చేస్తున్నట్లుగా అందరూ భావించారు. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా టికెట్ల ఖరారులో ఆలస్యం జరుగుతుంటే స్ట్రాటజీ అనుకున్నారు. అయితే అభ్యర్థుల ఖరారులో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగేసిందని అనుకుంటున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి లేటేస్ట్ కామెంట్ దుమారం రేపుతోంది. గెలిచేవారికి మాత్రమే టికెట్లు ఇచ్చామని ఎలాంటి రాజకీయ జోక్యం లేదని అధిష్టానం చెబుతుంటే.. తాజాగా రాజగోపాల్ రెడ్డి 25 మందికి టికెట్లు ఇప్పించానని చెప్పడం పార్టీశ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
సీనియర్లకు దక్కని ప్రాధాన్యం.. అలాంటిది కోమటిరెడ్డి సక్సెసా?
టీడీపీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డి వర్గానికి సైతం పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే విషయం తెలిసిందే. ఇక ఎంతోమంది సీనియర్లకు కూడా తమ వారికి సరైన రీతిలో టికెట్లు ఇప్పించుకునే అవకాశం లేకుండా పోయిందనే వార్తలొచ్చాయి. టికెట్ల కథంతా ఢిల్లీ చుట్టూ తిరగడంతో సీనియర్లు సైతం ఏమి చేయలేకపోయారనే వాదన వినిపిస్తోంది. అంతెందుకు వైఎస్ హయాంలో కీ రోల్ పోషించిన కొందరు సీనియర్లు వారి వారసులకే టికెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి.
అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 టికెట్లు ఇప్పించానంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణలో గెలుపే లక్ష్యమంటూ ఎలాంటి పైరవీలకు తావులేదన్న హైకమాండ్ దగ్గర కోమటిరెడ్డి తన పంతం ఎలా నెగ్గించుకున్నారో మరి.
25 మంది మీవాళ్లే.. మీరే ముఖ్యమంత్రా?
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ప్రకటించకుండా ఢిల్లీ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకరిని ప్రకటిస్తే మరో గ్రూప్ సరిగా పనిచేయదనేది వారి వ్యూహం కావొచ్చు. ఇలాంటి నేపథ్యంలో 25 మందికి టికెట్లు ఇప్పించుకున్నారంటే.. భవిష్యత్ ముఖ్యమంత్రిగా తనకు తానే ప్రకటించుకున్నట్లా? ఒకవేళ 25 స్థానాలు గెలిచినా అందులో సగానికి సగం విజయం వరించినా.. కోమటిరెడ్డి ఆధిపత్యం ఉన్నట్లేగా..! ఇలాంటి ప్రశ్నలకు మళ్లీ రాజగోపాల్ రెడ్డియే సమాధానం చెప్పాలి.