కొండా సురేఖ వివాదంలో శరవేగంగా మారుతున్న పరిణామాలు.. అప్పటిలోగా ఉద్వాసన!
తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంబంధిత వివాదాలపై పార్టీ హైకమాండ్ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే ఈ సమస్యను పరిష్కరించాలని, కొండా వివాదానికి చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తోంది.
కేసీ వేణుగోపాల్, ఖర్గే ఢిల్లీ వచ్చాక ఫైనల్ డెసిషన్
రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, పీసీసీ ఇప్పటికే కొండా సురేఖ మరియు చిన్నారెడ్డి వివాదానికి సంబంధించిన సమగ్ర నివేదికలు ఢిల్లీకి పంపింది. పార్టీ ప్రతిష్టకు జరిగిన నష్టం, తాజా పరిణామాలపై హైకమాండ్ నిశితంగా పరిశీలన చేస్తోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం ఢిల్లీకి తిరిగి రానున్నారు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు.

బెంగళూరు లో ఖర్గెను కలిసి కొండా సురేఖ వ్యవహారశైలిపై భట్టి నివేదిక
తాజా పరిణామాల క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఖర్గేను కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంత సమావేశంలో తాజా పరిస్థితులను వివరంగా చెప్పారు. కొండా సురేఖ వ్యవహారశైలి వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని, ఆమెపై క్రమశిక్షణా చర్యలు అవసరమని చెప్పినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ అంశంపై ఏకాభిప్రాయంతో ఉన్నారని కూడా తెలిపారు.
కొండా సురేఖను మంత్రి పదవి నుండి తప్పించే అవకాశం
ఖర్గే రాష్ట్ర నాయకత్వం పంపిన నివేదికను ఇప్పటికే పరిశీలించినట్లు స్పష్టం చేశారు. ఏఐసీసీ వర్గాల ప్రకారం, కొండా సురేఖను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె నిరాకరిస్తే మంత్రివర్గం నుంచి నేరుగా తొలగించే అవకాశం కూడా ఉందని చర్చలు సాగుతున్నాయి. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను మంత్రి పదవి నుండి తప్పించే అవకాశం కూడా అధిష్టానం పరిశీలిస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు ముందే తుది ప్రకటన
ఇక మరోవైపు చిన్నారెడ్డి వ్యవహారంపైనా పార్టీ నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో ఉన్నత స్థాయి సమావేశం జరిగిన తర్వాతే తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ వివాదాన్ని పరిష్కరించి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పార్టీని గాడిలో పెట్టటం హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుంది.












Click it and Unblock the Notifications