కేసీఆర్ కు కాళేశ్వరం కమీషన్ నోటీసుల వెనుక ఉంది వారే!
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నోటీసులపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ దిక్కుతోచని స్థితిలో కెసిఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఇదంతా కాంగ్రెస్, బిజెపి కలిసి ఆడుతున్న నాటకమని కేటీఆర్ ఆరోపించారు.
ఎన్ని నోటీసులిచ్చినా, హామీలపై వదిలిపెట్టం: కేటీఆర్
హామీల అమలు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇటువంటి చర్యలకు దిగుతున్నారని, అయినప్పటికీ ఎన్ని నోటీసులు ఇచ్చినా, హామీల అమలు పైన ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నోటీసులు ఇవ్వడం పైనే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు చట్టాల పైన నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

పాలన చేతకాక నాటకాలు
పాలన చేతకాక ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని, రేవంత్ సర్కార్ కు కమిషన్లు తప్ప పాలన చేతకాదని మండిపడ్డారు. కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం ఓ చిల్లర ప్రయత్నమని ఇలాంటి ఎన్నో నోటీసులు ఇచ్చిన అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ కమీషన్ లపై వారి మంత్రులే చెప్తున్నారు
20 శాతం నుంచి 30 శాతం కమిషన్లు ఇవ్వకపోతే తమ ప్రభుత్వ హయాంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు బహిరంగంగా చెబుతున్నారని అందుకే తమ అవినీతి కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే కాళేశ్వరం కమిషన్ నోటీసుల డ్రామా ఆడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 17 నెలలుగా పాలన చేతకాక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎస్ఎల్ బీసీ దుర్ఘటనలో ఏం జరిగిందో చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం
slbc టన్నెల్ కూలిన ఘటనలో ఎనిమిది మంది అందులో చిక్కుకుంటే, సమయానికి స్పందించి వారిని కాపాడిన దిక్కు లేదన్నారు. కమిషన్ల ఆరాటంలో మృతదేహాలను వెలికి తీయడానికి కూడా సాహసం చేయలేకపోయారని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అసలు slbc లో ఏం జరిగిందో ఇప్పటివరకు చెప్పలేకపోతున్న దద్దమ్మ ప్రభుత్వం మీదని కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీ లను పక్కన పెడదామని చూస్తే ఊరుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications