బిజెపి డీఎన్ఏ లోనే అబద్ధాలు; సంక్షేమానికి టీఆర్ఎస్.. సంక్షోభానికి బీజేపీ: మంత్రి హరీష్ రావు
తెలంగాణ మంత్రి హరీష్ రావు బిజెపి ని టార్గెట్ చేసే విమర్శలు గుప్పించారు. తెలంగాణ లోని టిఆర్ఎస్ రాష్ట్రానికి కృష్ణా, గోదావరి జలాలను ఎత్తి పోసే పనిలో ఉంటే, బిజెపి తెలంగాణ ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లి పనిలో ఉందని మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఈడీ, సి.బి.ఐ వంటి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయనే విషయాన్ని బీజేపీ నేతలే పరోక్షంగా అంగీకరిస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తులుగా ఉన్నవారిని కోన్ కిస్కా గాళ్లు అంటూ మాట్లాడిన బిజెపి, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయించిందో చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

చండూరు సభ సక్సెస్ తో బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేదు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెకిలి చేష్టలతో, నకిలీ మాటలతో ఏదో చెప్పాలని చూస్తున్నారని విమర్శించారు. ఇక వారి స్థాయి ఏమిటో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఢిల్లీ దూతలు చెప్పారని హరీష్ రావు పేర్కొన్నారు. చండూరు లో టిఆర్ఎస్ సభ విజయవంతం కావడంతో బిజెపి నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అంతేకాదు వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు, చేనేతపై జిఎస్టి విధింపు కు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని బిజెపి నేతలు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

బిజెపి డీఎన్ఏ లోనే అబద్ధాలు ఉన్నాయన్న హరీష్ రావు
బిజెపి డీఎన్ఏ లోనే అబద్ధాలు ఉన్నాయని హరీష్ రావు మండిపడ్డారు. 65 లక్షల మంది రైతుల జీవితాలతో ముడిపడిన వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు విషయంలో 30 వేల కోట్లు ఇస్తామని తెలంగాణ ఆర్థికశాఖకు కేంద్రం లేఖ రాసినా సీఎం కేసీఆర్ తిరస్కరించారని చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి బిజెపి చేసిందేమీ లేదని పేర్కొన్న మంత్రి హరీష్ రావ్ మిషన్ భగీరథకు 19200 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం ఇవ్వలేదన్నారు .

గుజరాత్లో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి
ఇక ఫ్లోరైడ్ నిర్మూలనకు ఎనిమిది వందల కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఇరవై ఉత్తరాలు రాసినా స్పందన లేదని, మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రమైన గుజరాత్లో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పై మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బీజేపీ అంటేనే కూలిపోయే బ్రిడ్జీలు
బిజెపి అంటే కూలిపోయే బ్రిడ్జిలు, ప్రజల ప్రాణాలు నీళ్ల పాలు అన్నట్టుగా తయారైందని పేర్కొన్నారు. సంక్షేమానికి టీఆర్ఎస్ సంక్షోభానికి బీజేపీ నిర్వచనంగా మారాయని హరీష్ రావు పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు పాలు, నీళ్లకు తేడాని గుర్తించి ప్రజాస్వామ్య విలువలను పెంచేలా తీర్పు ఇస్తారని నమ్మకం ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక మునుగోడులో జేపీ నడ్డా సభను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు బిజెపికి చెంప పెట్టు లాంటి తీర్పు ఇస్తారని మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications