కౌంటర్ థియరీ ఆఫర్ చేయండి.. అంతేకానీ!..: కంచ ఐలయ్య పుస్తకంపై మహేష్ కత్తి
కొంతమంది ఆయన పోస్టులతో ఏకీభవిస్తుండగా.. మరికొంతమంది ఘాటుగానే విమర్శిస్తున్నారు
హైదరాబాద్: 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అంటూ సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన పుస్తకం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుస్తకానికి మద్దతు తెలుపుతున్నవారు, ఐలయ్య రచనలను వ్యతిరేకిస్తున్నవారు దీనిపై పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బహుజనవాది, ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి దీనిపై స్పందించారు. పుస్తకంపై, దాని రచయిత కంచ ఐలయ్యపై ఆయన తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొంతమంది ఆయన పోస్టులతో ఏకీభవిస్తుండగా.. మరికొంతమంది ఘాటుగానే విమర్శిస్తున్నారు.

ఇంతకీ మహేష్ కత్తి ఏమన్నారంటే.. ' అధికార కులాలు శ్రామిక కులాల్ని దోచుకుతిని, వాళ్ళ జ్ఞానాన్ని అణగదొక్కారు అనేది కంచ ఐలయ్య గారి సిద్దాంతం. దానికి బలాన్ని చేకూర్చేవే ఈ పుస్తకాలు. వీటితో విభేధించే వాళ్ళు కొంచం చరిత్రను తెలుసుకుంటే మంచిది. నరుకుతా చంపుతా అనేవారు కాస్త రాజ్యాంగాన్నీ చట్టాన్ని తెలుసుకుంటే ఇంకా మంచిది'. అని పేర్కొన్నారు.
పుస్తక వివాదం నేపథ్యంలో కంచ ఐలయ్యను చంపుతామని బెదిరిస్తున్నవారిని మహేష్ కత్తి సున్నితంగా హెచ్చరించారు. 'ఇక్కడ హక్కులు దళితులకా అధికార కులాలకా అనేది కాదు. Right to freedom of expression అందరికీ ఉంది. కానీ కొడతాం, చంపుతాం అని బెదిరించి హక్కు ఎవరికీ లేదు'.
'కంచ ఐలయ్య గారు రాసింది అభ్యతరకరం అయితే అభ్యతరాన్ని తెలపండి. కౌంటర్ థియరీ ఆఫర్ చెయ్యండి. అఫెన్సివ్ అనిపిస్తే కోర్టుకు వెళ్ళండి. ఇవన్నీ అందరికీ ఉన్న హక్కులే. కానీ చట్టం రక్షణ కల్పించిన హక్కుకు హాని కలిగిస్తూ, అది మా హక్కు అని మాత్రం అనకండి'. అంటూ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications