మేడారం మహా జాతర తేదీలు ఖరారు ... ఎప్పుడంటే
గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర తేదీలను ప్రకటించారు సమ్మక్క సారలమ్మల పూజారులు . కొండాకోనా పరవశించేలా ,జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభ మేళాను తలపిస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విగ్రహాలు లేని విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్తమైనది.
కుక్క పంచాయితీ .. మహిళలను విచాక్షణారహితంగా కొట్టిన కాంగ్రెస్ లీడర్
రెండేళ్లకోసారి మహా జాతర .. జాతర తేదీలను ప్రకటించిన పూజారులు
రెండేళ్ల కు ఒకసారి జరిగే ఈ మహా జాతర ఎప్పుడూ విశేషమే. ఈసారి జరగనున్న మహా జాతర తీదీలను ఈదఫా 9 నెలల ముందే ప్రకటించారు పూజారులు .మేడారంలో 2020లో నిర్వహించే శ్రీ సమ్మక్క - సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో పూజారులు, ఇతరులు సమావేశమయ్యారు. మాఘ శుద్ధ పౌర్ణమి గడియలను ఆధారంగా నిర్ణయించిన జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ప్రకటించారు.2018లో జరిగిన జాతరకు సంబంధించి తేదీలను 6 నెలల ముందుగా ప్రకటించారు. కానీ 2020 జాతర తేదీలను 9 నెలల ముందుగానే ప్రకటించడం విశేషం.
ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు నాలుగు రోజుల పాటు మహా జాతర
పూజారులు నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు జాతర జరగనుంది . ఫిబ్రవరి 5వ తేదీ కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజులను గద్దెలపైకి తీసుకొస్తారు.ఫిబ్రవరి 6వ తేదీ గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని గద్దె మీదకు తీసుకొస్తారు.ఫిబ్రవరి 7వ తేదీన వన దేవతలకు మొక్కుల చెల్లింపు చేస్తారు . ఫిబ్రవరి 8వ తేదీన తల్లుల వనప్రవేశం తో జాతర ముగుస్తుంది .
నాలుగు రోజుల పాటు సాగనున్న జాతర ... జనసంద్రంగా మేడారం
నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర లో మండమెలిగే పండుగతో జాతరను ప్రారంభించి, సమ్మక్క సారలమ్మలకు పూజలు నిర్వహించి, భక్తులు మొక్కులు చెల్లింపు చేసి, అమ్మవార్ల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే అసంఖ్యాకమైన ప్రజలతో మేడారం వనమంతా జనసంద్రంగా మారుతుంది. నాలుగు రోజులపాటు భక్తులు గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని బెల్లాన్ని బంగారంగా నివేదించి మొక్కులు చెల్లించుకుంటారు.