మంత్రి కేటీఆర్ మాస్టర్ ప్లాన్: జాతీయ పార్టీలు వద్దంటూ..ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసి ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పర్యటనలు చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని దూకుడుగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్, బిజెపిలకు చెక్ పెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారా? జాతీయ పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరించరని పదే పదే చెబుతూ జాతీయ పార్టీలను తెలంగాణ ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారా? లోకల్ సెంటిమెంట్ తో అగ్గి రాజేస్తున్నారా అంటే అవును అని సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
మంత్రి కేటీఆర్ కొత్త వ్యూహం ... మరోమారు లోకల్ అస్త్రం
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల కాలంలో ఎక్కడ పర్యటన చేసిన ప్రధానంగా లోకల్ అస్త్రాన్ని స్పందిస్తున్నారు. కెసిఆర్ లోకల్ అంటూ, ఆయనకు మాత్రమే తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటో తెలుసు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎట్టికైనా, మట్టి కైనా మనోడే ఉండాలంటూ వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, తాజాగా మహబూబ్ నగర్ పర్యటనలో మరోమారు అదే విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణ ను గుండెల్లో పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించే సీఎం కేసీఆర్ ను ప్రజల గుండెల్లో పెట్టుకోవాలంటూ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
సీఎం కేసీఆర్ కు ఉండే ప్రేమ, ఆర్తి, ఢిల్లీ, గుజరాత్ వాళ్లకు ఉంటాయా?
దేశంలోని రెండు జాతీయ పార్టీలకు నీతి లేదని తెలంగాణ రాష్ట్రం పై సీఎం కేసీఆర్ కు ఉండే ప్రేమ, ఆర్తి, ఢిల్లీ, గుజరాత్ వాళ్లకు ఉంటాయా అంటూ తెలంగాణ ప్రజలు మొదటి నుంచి ఉన్న లోకల్ సెంటిమెంట్ ను మరోమారు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీలకు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోరని, మిగతా రాష్ట్రాలు ఎంతో తెలంగాణ రాష్ట్రం కూడా జాతీయ పార్టీలకు అంతేనని, కానీ టిఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజల అభివృద్ధి మాత్రమే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని కేటీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలను చిత్తు చేసేలా కేటీఆర్ మాస్టర్ ప్లాన్
ఒకపక్క బిజెపి కెసిఆర్ కుటుంబ పాలనపై, అవినీతిపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఒక అవకాశం ఇవ్వాలని పాదయాత్రలు చేస్తూ విజ్ఞప్తి చేస్తుంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, జాతీయస్థాయి అగ్రనేతలను రంగంలోకి దించి తెలంగాణ ప్రజలను తమవైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. అటు బండి సంజయ్, ఇటు రేవంత్ రెడ్డి గట్టిగానే అధికార టీఆర్ఎస్ పై పోరాటం చేస్తున్నారు. ఇక ఈ రెండు పార్టీల తెలంగాణ రాష్ట్ర నాయకుల వ్యూహాలను చిత్తు చేసేలా మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బలమైన సెంటిమెంట్ గా ఉన్న లోకల్ కాన్సెప్ట్ ను పదే పదే వాడుతున్నారు.
మేం లోకల్ ... ఎన్నికలను టార్గెట్ చేసుకుని మంత్రి కేటీఆర్
వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసి ఇప్పటి నుంచే ప్రజల్లోకి మేము లోకల్ అనే సంకేతాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు దఫాలుగా తెలంగాణ ప్రజానీకం లోకల్ సెంటిమెంట్ తోనే సీఎం కేసీఆర్ పాలన కు పట్టం కట్టింది. కానీ మూడో సారి కేసీఆర్ సర్కారు అవకాశం ఇస్తారా లేదా అన్న అనుమానం అటు టీఆర్ఎస్ నేతల్లోనూ వ్యక్తమవుతోంది. ఇక మరో పక్క ప్రతిపక్షాలు కూడా ఈ సారి ప్రజలు మార్పు కోరుకుంటారని భావిస్తూ దూకుడుగా, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడంతో టిఆర్ఎస్ పార్టీలో ఆందోళన మరింత పెరిగింది.
Recommended Video
ప్రజల సెంటిమెంట్ తో గులాబీ మాస్టర్ ప్లాన్ .. వర్కవుట్ అవుతుందా ?
ఈ క్రమంలోనే ప్రజల సెంటిమెంటును ఆయుధంగా చేసుకుని మంత్రి కేటీఆర్ నిదానంగా ప్రజల్లో లోకల్ ఫీలింగ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీలను ఆదరించ వద్దని సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణను ఏ మాత్రం అభివృద్ధి చేయలేరని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వారికి అవకాశం ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పాలన సాగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుందని చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా టిఆర్ఎస్ పార్టీ కొత్త వ్యూహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న క్రమంలో మళ్లీ తెలంగాణ లోకల్ సెంటిమెంట్ టిఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాలి.