నిన్న యెన్నం, నేడు రాజాసింగ్.. తిరుగుబాటు కారణాలివే: బిజెపిలో 'బీఫ్' చిచ్చు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి పైన పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు... రాజాసింగ్ విమర్శలు బిజెపికి చిక్కులు తెచ్చి పెట్టేవే. కిషన్ రెడ్డి తీరు నచ్చకే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీకి దూరమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజాసింగ్కు కోపం రావడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
బీఫ్ ఫెస్టివెల్, మధుగౌడ్ చేరికతో చిచ్చు
ఒకటి బీఫ్ ఫెస్టివెల్ పైన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. రెండోది మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ సోదరుడు మధుగౌడ్ను పార్టీలో చేర్చుకోవడం. ఈ రెండు రాజాసింగ్ లోథ్ను ఆగ్రహానికి గురి చేశాయని తెలుస్తోంది.
మంగళవారం రాజాసింగ్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. బీఫ్ తినడాన్ని అభ్యంతర పెట్టమని కిషన్ రెడ్డి చెప్పడం గర్హణీయమన్నారు. బీఫ్ తిన వచ్చునని మా పార్టీలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదన్నారు. పశువధ పైన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని చెప్పారు.
గోసంరక్షణ గురించి హిందువులు, తమ పార్టీ వారు పని చేస్తారన్నారు. ఓయులో జరిగి బీఫ్ ఫెస్టివెల్ను తాము అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. బీఫ్ తింటే తమకు అభ్యంతరం లేదని చెప్పడం విడ్డూరమన్నారు. బీఫ్ వ్యాఖ్యల పైన కిషన్ రెడ్డి హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు.
కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అసలు తెలంగాణలో బిజెపి అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చించారా అని నిలదీశారు. కిషన్ రెడ్డి తీరు పైన ప్రధాని మోడీకి, జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు.
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోదరుడు మధు గౌడ్ గురించి కూడా రాజాసింగ్ స్పందించారు. మధుగౌడ్ను పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుబట్టారు. మధుగౌడ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ దోచుకునేది అన్నారు. బిజెపి ప్రజలకు మేలు చేసే పార్టీ అన్నారు. మధుగౌడ్ బిజెపిని నాశనం చేసేందుకే పార్టీలోకి వచ్చారన్నారు.
బిజెపికి మంచి చేసేందుకు ఆయన రాలేదన్నారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని, ఆయన తరవాత మంచి వ్యక్తికి పదవి ఇస్తే ఆయనతో కలిసి పని చేస్తామన్నారు. మధుగౌడ్ బిజెపికి మంచి చేసేందుకు రాలేదని నేను రాసిస్తానని సవాల్ చేశారు. ప్రజలకు మోసం చేసే వారిని కిషన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.