మునుగోడులో జోరుగా తనిఖీలలో భారీగా నోట్లకట్టలు; మద్యం కొనుగోలుపైనా నిఘా; అధికారులు ఏం చెప్తున్నారంటే!!
మునుగోడు ఉప ఎన్నికలలో ధన ప్రవాహం జోరందుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మునుగోడు కు డబ్బుల వరద కొనసాగుతుంది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 16 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక చాలా ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం వల్ల డబ్బులు యదేచ్ఛగా మునుగోడు కు రవాణా అవుతున్నాయి.

మునుగోడులో బయటపడుతున్న నోట్ల కట్టలు
అయితే తాజాగా మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చల్మెడ క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో ఓ కారులో కోటి రూపాయల నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి బిజెపి పార్టీ నాయకులకు సంబంధించిన డబ్బులు గా భావిస్తున్నారు. ఈ డబ్బులను మునుగోడుకు ఎందుకు తీసుకు వస్తున్నారు అన్నదానిపై విచారణ చేపట్టారు. అయితే బిజెపి నాయకులు కావాలని బిజెపి నాయకులకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల వాహనాలను తనిఖీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు.

టీఆర్ఎస్ ధన ప్రవాహం.. అధికారులు పట్టించుకోవటం లేదని బీజేపీ ఆరోపణ.. కాంగ్రెస్ అసహనం
టిఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా మునుగోడు కు డబ్బులను తరలిస్తున్నదని , అందుకు అధికారులు కూడా సహకరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఎన్నికల అధికారులు టిఆర్ఎస్ పార్టీ ఏం చేసినా చూసీచూడనట్టు పోతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఇక బీజేపీ, టీఆర్ఎస్ డబ్బుల పంపిణీపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. గెలుపు కోసం రెండు పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల అధికారుల వెర్షన్ ఇలా
ఇదిలా ఉంటే ఎన్నికల అధికారులు మాత్రం ప్రలోభాలను అడ్డుకోవడానికి ప్రతి మండలానికి మూడు చొప్పున సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశామని, ఏడు మండలాల్లో ఏకకాలంలో ఇరవై ఒక్క బృందాలు పనిచేస్తాయని, వీళ్ళ పైన పర్యవేక్షించే మరిన్ని బృందాలు అదనంగా ఉన్నాయని చెప్తున్నారు. ప్రజలు వారి పరిధిలో ఎలాంటి ఘటనలు జరిగినా స్థానిక అధికారులకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయ్యాలని చెబుతున్నారు. ఏ పార్టీ వారూ తమకు సన్నిహితులు కాదని, తాము తమ విధి నిర్వహణను కొనసాగిస్తామని చెప్తున్నారు.

మద్యం కొనుగోళ్ళకూ ఆన్ లైన్ చెల్లింపులు తీసుకోవాలని ఆదేశం
ఇక మునుగోడు ఉపఎన్నికలకు మద్యం ఏరులై పారుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వైన్స్ దుకాణాల నుండి మద్యం కొనుగోలు చేసి తీసుకు వెళ్ళే వారి నుండి ఆన్లైన్ చెల్లింపులు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దుకాణదారులు ఆదేశించామని చెబుతున్నారు. దీంతో ఎవరు మద్యం తీసుకెళ్తున్నారో తెలుస్తుందని, తద్వారా ఓటర్లను మద్యంతో ప్రలోభపెట్టే పార్టీలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు.

మునుగోడులో ఓటర్లను ప్రలోభ పెట్టటానికి శతవిధాలా ప్రయత్నాలు
ఇప్పటికే డబ్బులు నియోజకవర్గం లోకి తీసుకు వెళుతున్న క్రమంలో భారీగా పట్టుబడుతున్న క్రమంలో మునుగోడు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నం జరుగుతుందో అర్థమవుతుంది. అన్ని పార్టీలు భారీగా డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెట్టటానికి ప్రయత్నాలు చేస్తూ నగదు తరలిస్తూ నానా తంటాలు పడుతున్నారు.












Click it and Unblock the Notifications