మునుగోడు పోలింగ్: ఓటేసిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, పాల్వాయి స్రవంతి; శివాలయంలో కోమటిరెడ్డి పూజలు
మునుగోడు లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా, ప్రస్తుతం పోలింగ్ కొద్దికొద్దిగా పుంజుకుంటుంది. పోలింగ్ కేంద్రాలకు వంద కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. అయితే మునుగోడు లో పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదు అవుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
2018 ఎన్నికలలో మునుగోడు నియోజకవర్గంలో 91.38 శాతం ఓటింగ్ నమోదవగా, ఈసారి కొత్త ఓటర్లు కూడా చేరడంతో ఎంత మేరకు పోలింగ్ నమోదు అవుతుందన్నది అందరిలోనూ ఆసక్తి గా మారింది.ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంస్థాన్ నారాయణపురం మండలం లింగ వారి గూడెం పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. అక్కడ ఆయన క్యూలైన్లో నిలబడి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇడికుడలో ఓటేసిన పాల్వాయి స్రవంతి.. ప్రత్యేక పూజాలు చేసిన కోమటిరెడ్డి
కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇడికుడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చి ఆమె తన ఓటును వేశారు. ఇక మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదయమే శివాలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం పోలింగ్ సరళిని పరిశీలించడానికి ఆయన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

స్థానికేతరులను పట్టుకున్న ఎన్నికల అబ్జర్వర్.. నగదు సీజ్, పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ హంగామా
ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక ఫంక్షన్ హాల్ లో ఉన్న స్థానికేతరులను ఎన్నికల అబ్జర్వర్ గుర్తించారు. వారి వద్ద డబ్బులు, ఇతర సామాగ్రిని పట్టుకున్నారు. ఇక పట్టుబడిన నగదును అధికారులు సీజ్ చేశారు. కాగా మునుగోడు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజాశాంతి పార్టీ అధినేత మునుగోడు ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన కె ఏ పాల్ సందడి చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 10 వేళ్ళకు 10 ఉంగరాలు పెట్టుకొని వచ్చిన కే ఏ పాల్ తనదే గెలుపని, ఎవరెన్ని కుట్రలు చేసినా తన గెలుపును ఆపలేరని చెబుతూ నవ్వులు పూయిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ తనపై కుట్ర చేస్తోందని కే ఏ పాల్ ఆరోపిస్తున్నారు.

మునుగోడులో ప్రశాంతంగా పోలింగ్.. వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు
ఇదిలా ఉంటే ఈ మునుగోడులో ఇప్పటివరకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూకడుతున్నారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు ఉదయాన్నే ఓటు వేసి వెళుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో వృద్ధుల కోసం ప్రత్యేకమైన క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications