రూ. 100 నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి: త్రివిక్రమ్ వస్తున్నారంటే పుస్తకాలు దాచేస్తానంటూ పవన్ కళ్యాణ్
హైదరాబాద్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మను 100 రూపాయల నోటుపై వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన నేతాజీ గ్రంథ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. నేతాజీ గ్రంథ సమీక్షకు డా.పద్మజారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్రివిక్రమ్ వస్తున్నాడంటే పుస్తకాలు దాచేస్తా: పవన్ కళ్యాణ్
సినిమా ఉచితంగా చేస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తానని చమత్కరించారు. నేను సినిమా నటుడు అవ్వాలని అనుకోలేదని.. అలాగే ప్రజా సేవలోకి రావాలని కూడా ఊహించలేదన్నారు పవన్ కళ్యాణ్. పుస్తకాల సహవాసంతోనే తనకు వివిధ అంశాలపై అవగాహన వచ్చిందన్నారు.
వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి: పవన్ కళ్యాణ్
నేతాజీ అస్తికలు మన దేశానికి తీసుకురావాలని ప్రజలు కోరుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. నేతాజీ అస్తికలు రెంకోజి ఆలయంలో దిక్కు లేకుండా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అస్తికలు నేతాజీవి అవునా కాదా అని పరీక్షలు చేయలేరా? అని పవన్ ప్రశ్నించారు. ఇప్పటికి మూడుసార్లు ప్రయత్నించినా కుదరలేదన్నారు. నేతాజీని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ వేయాలని సూచించారు. జైహింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని పవన్ కొనియాడారు.
పుస్తకాల వల్లే జీవితం అంటే తెలిసింది: పవన్ కళ్యాణ్
నేతాజీ గ్రంథ సమీక్ష పుస్తకాన్ని రచించిన ఎంవీఆర్ శాస్త్రిని ఇప్పటివరకు మూడుసార్లు కలిశానని పవన్ తెలిపారు. కామన్మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సమయంలో శాస్త్రితో పరిచయం ఏర్పడిందన్నారు. మన నుడి-మన నది కార్యక్రమంలో మరోసారి కలిసినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ పుస్తక సమీక్షలో మళ్లీ కలిశానని తెలిపారు. నాకు మేధావులంటే భయమని.. నేను సగటు మనిషినని పేర్కొన్నారు. ఎంవీఆర్ శాస్త్రి దాదాపు 20 పుస్తకాలు రచించారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అనంతపద్మనాభ స్వామి నేలమాలిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలకే ఎక్కువ విలువైనవని తెలిపారు. దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల జీవితాలను చదవడం వల్లే నాకు జీవితం అంటే ఏంటో అర్థమైందన్నారు పవన్ కళ్యాణ్.
నేతాజీ లాంటి మహాత్మున్ని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదు
నేతాజీ లాంటి మహాత్మున్ని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా #BringbackNetajiAshes బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాసెస్ హ్యాష్ ట్యాగ్ను ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఈ దేశం నాదనుకునే ఒక్క నాయకుడు లేడన్నారు. నేతాజీ కోసం కొత్త తరం కదలి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాగా, భారత కరెన్సీపై నేతాజీ, భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు కూడా వేయాలంటూ గత కొంతకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేతాజీ బొమ్మ వేయాలని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.