వ్యాపార వీసాపై వచ్చి మత్తుపదార్థాల విక్రయిస్తున్న నైజీరియన్లు
మత్తుపదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద యెత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14 గ్రాముల కొకైన్, 7 గ్రాముల హెరాయిన్, 5.2 కిలోల గంజాయి, రెండు నైజీరియా పాస్పోర్టులు, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, రూ. 21,100 స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి సౌత్, ఈస్ట్జోన్ ఇన్స్పెక్టర్లు యాదగిరి, శ్రీధర్తో కలిసి వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఓకారో కాస్మాస్ రామ్సే, అబ్రహాం జాకబ్ ఉకోషా వ్యాపార వీసాపై మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు.
షేక్పేట, మినీ గుల్షన్ కాలనీలో ప్లాట్ నెంబర్ 302లో నివసిస్తున్నారు. ఓకారో కాస్మాస్ రామ్సే పూణె నుంచి హెరాయిన్, కొకైన్, గంజాయి కొనుగోలు చేసి స్నేహితుడు అబ్రహాం జాకబ్ ఉకోషా ద్వారా నగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నాడు. షేక్పేటలో విక్రయిస్తు న్నారని సమాచారం అందుకున్న సౌత్, ఈస్ట్ జోన్ల టాస్క్ఫోర్స్, గోల్కొండ పోలీసులు వారు నివసిస్తున్న ఇంటిపై దాడి చేశారు.
విక్రయించటానికి సిద్ధంగా ఉన్న కొకైన్, హెరాయిన్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం వారిని గోల్కొండ పోలీసులకు అప్పగించారు.