రేవంత్ రెడ్డికి జై కొడుతున్న ప్రజలు.!అనూహ్యంగా మారిన పబ్లిక్ పల్స్.!
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ మారుతున్నట్టు తెలుస్తోంది. అప్రతిహతంగా దూసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీకి, సీఎం చంద్రశేఖర్ రావుకు తిరుగులేదనే దశ నుంచి, కనుచూపు మేరలోనే బలమైన ప్రత్యర్థులు యుద్ధానికి సిద్ధమై, కత్తులు నూరుతున్న పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇప్పట్లో కారును ఢీకొట్టే పరిస్థితే లేదు అనే ధీమా పోయి, కారుమబ్బులు కమ్ముకుంటున్న స్థితి ఏర్పడుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో చంద్రశేఖర్ రావుకు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి ఎదుగుతున్నారని, అందుకు ప్రజామోదం కూడా ఉందని తాజాగా జరిపిన ఓ సర్వే స్పష్టం చేస్తోంది.
ప్రజాభిప్రాయాల్లో మార్పు.. నూతన నాయకత్వంవైపు రాష్ట్ర ప్రజల చూపు..
తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై "ది గ్రౌండ్ రిపోర్ట్" అనే ప్రముఖ సర్వే సంస్థ జనతా పోల్ నిర్వహించింది. ఈ సర్వే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు నిజమయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థ తెలంగాణలో ఓ వినూత్న సర్వే నిర్వహించింది. ఏ పార్టీ బెస్ట్? ఏ లీడర్ బెస్ట్? ఎవరిని సీఎంగా చూడాలని అనుకుంటున్నారు? అనే అంశాలను సర్వేలో ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలతో రిపోర్ట్ రిలీజ్ చేశారు. సర్వేలో వెల్లడయిన ఆసక్తికర విషయమేంటంటే, "అత్యంత పాపులర్ సీఎం క్యాండిడేట్" గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేశారు.
పుంజుకుంటున్న కాంగ్రెస్.. రేవంత్ కు పెరుగుతున్న ప్రజాధరణ
ఇదిలా ఉండగా "ది గ్రౌండ్ రిపోర్ట్ "సర్వేలో అత్యధికంగా 44శాతం మంది ప్రజానీకం రేవంత్ రెడ్డి సరైన సీఎం అభ్యర్థి అని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇక రెండో స్థానంలో సీఎం చంద్రశేఖర్ రావు వైపు మొగ్గు చూపారు. చంద్రశేఖర్ రావును 42శాతం మంది సీఎంగా కోరుకుంటున్నారు. మూడో స్థానంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను 6 నుంచి 7శాతం మంది సీఎంగా ఆమోదిస్తున్నారు. ఈ ముగ్గురు కాకుండా ఇతరుల వైపు ఒకశాతం మంది ప్రజలు మొగ్గు చూపుతున్నట్టుగా ఆ సర్వే వివరాలను వెల్లడించింది.
ప్రత్యామ్నాయ నాయకత్వం కావాలి.. మార్పు దిశగా ప్రజల ఆలోచన..
ఇక సీట్ల విషయానికి వస్తే, రాబోవు ఎన్నికల్లో టీఆర్ఎస్ 59 నుంచి 64 స్థానాలు గెల్చుకుంటుందని సర్వే పేర్కొంది. టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం 6 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్ 35 నుంచి 40సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో స్పష్టమైంది. బీజేపీ 12 నుంచి 14 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని "ది గ్రౌండ్ రిపోర్ట్ " తెలిపింది. ఇతర పార్టీలు 5 నుంచి 6 సీట్లు గెల్చుకుంటాయని పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండటం, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటం ఇక్కడ కొసమెరుపు.
గులాబీకి ఎదురీత తప్పదా.. రేవంత్ రాకతో కాంగ్రెస్ లో నయా జోష్
సర్వేలో ప్రజల అభిప్రాయం చూస్తుంటే, టీఆర్ఎస్ క్రమక్రమంగా ప్రజాదరణ కోల్పోతున్నట్టు స్పష్టమవుతోంది. 2018లో టీఆర్ఎస్ గెల్చుకున్న 88 మంది ఎమ్మెల్యేలకు తోడు ఇతర పార్టీల నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలతో కలిపి ప్రస్తుతం టీఆర్ఎస్ కు 107 మంది ఎమ్మెల్యేల బలముంది. కానీ ప్రస్తుతం ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 65 నుంచి 70 స్థానాలు గెలుస్తుందని సర్వే చెబుతోంది. ఈ లెక్కన ప్రస్తుతం టీఆర్ఎస్ తో ఉన్న ఎమ్మెల్యేల్లో 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే చెప్పకనే చెబుతోంది. దీంతో టీఆర్ఎస్ ప్రజాదరణను కోల్పోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
కాంగ్రెస్ లో నయా జోష్.! ప్రతిరోజూ సందడిగా మారిన గాంధీ భవన్
నాలుగు నెలల క్రితం వరకు కాంగ్రెస్ స్తబ్ధుగా ఉంది. కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో బలమైన శ్రేణులు ఉన్నా, సంప్రదాయ ఓటు బ్యాంకు పదిలంగా ఉన్నా, సరైన నాయకత్వం లేక కొంత నిరాశా నిస్పృహలో ఉంది కాంగ్రెస్. చాలా మంది మనుగడ కోసం ఇతర పార్టీల్లో చేరిపోయారు. అంతేకాకుండా కాంగ్రెస్ బలంగా ఉంటే ఎప్పటికైనా తమకు ముప్పేనని భావించిన చంద్రశేఖర్ రావు, ఆ పార్టీలోని ముఖ్యనేతల్ని చేర్చుకుని, కీలక పదవులు కట్టబెట్టారు. బలమైన నేతలు పార్టీని వీడటం, చాలామంది సీనియర్లు చంద్రవేఖర్ రావుపై దూకుడు ప్రదర్శించకపోవడం వల్ల, కాంగ్రెస్ ప్రధాన పోటీలో కనిపించలేదనే చర్చ కూడా చోటుచేసుకుంది. కానీ రేవంత్ రెండ్డి రేసులోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అంటూ శ్రేణుల్లో ఉత్సాహం పెంచుతున్నారు.