తెరాసకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి: టిడిపి, బిజెపి వేదికపై ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆ పార్టీ ఎల్బీ నగర్ శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య హైదరాబాదులో జరిగిన నిజాం కళాశాల మైదానంలోని మంగళవారం ఏర్పాటైన ఎన్నికల ప్రచార సభ వేదిక మీద కనిపించారు. ఆయన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖబడ్దార్ అంటూ తెరాస నాయకులను ఆయన హెచ్చరించారు.
తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. కుట్రలు, మంత్రాలు, యజ్ఞయాగాదులతో జిహెచ్ఎంసి పీఠాన్ని కైవసం చేసుకోవాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తెరాసను గెలిపిస్తే హైదరాబాదును అభివృద్ధి చేయబోరని, జిహెచ్ఎంసిలో చాలా డబ్బులున్నాయని, ఆ డబ్బులను కాకతీయ మిషన్కు తరలిస్తారని ఆయన అన్నారు. ఇప్పటికే దాదాపు 350 కోట్ల రూపాయలు కేటాయించారని ఆయన అన్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెరాసకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వర్షాలు పడలేదని ఓ ముసలమ్మ అన్నదని, అయితే తాను వాటిని నమ్మబోనని అంటే ధర్మాత్ములు ఏలితే వర్షాలు పడుతాయని ముసలమ్మ చెప్పిందని అన్నారు. నిజంగానే తెలంగాణలో వర్షాలు లేవని, మేలో కూడా ఎండిపోని హిమాయత్ సాగర్, ఇతర హైదరాబాద్ రిజర్వాయర్లు ఎండిపోయాయని ఆయన అన్నారు.
గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయని ఆయన అన్నారు. యాగం వల్ల వర్షాలు పడుతాయని అనుకున్నానని, కానీ పడలేదని ఆయన అన్నారు. నెత్తికెక్కిన కెసిఆర్ తెరాస నాయకుల మదాన్ని ఓటు ద్వారా కాళ్లకిందికి దించాలని ఆయన పిలుపునిచ్చారు. డబుల్ బెడ్రూంలు బొందలల్లో చూపిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆయన ప్రశంసించారు.
మూడు రోజుల్లో చంద్రబాబు కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తెచ్చారని పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి అన్నారు. 18 నెలల్లో తెలంగాణ ఏడారి అయిందని ఆయన అన్నారు. కెటిఆర్ టీ హబ్ చూపించి హడావిడి చేస్తున్నారని ఆయన అన్నారు.
దొడ్డిదారిన మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని టిడిపి ఎమ్మెల్యే వివేక్ అన్నారు. కెటిఆర్, కవిత హైదరాబాదు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. కెటిఆర్ తన సవాల్కు కట్టుబడి ఉండాలని టిడిపి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.
యాగం కోసం కెసిఆర్ అధికార దుర్వినియోగం చేశారని, ప్రజలను ఆ రకంగా మోసం చేశారని టిడిపి నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాదును ఎన్టీఆర్, చంద్రబాబు అభివృద్ధి చేశారని ఆయన అన్నారు.