వారంలో వంద మంది, ఇతరుల మీదికి నెట్టేస్తారా: రైతు ఆత్మహత్యలపై రావుల
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో వ్యవసాయం బలిపీఠంపై ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం గ్రామాల్లోకి వెళ్లి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. వారంరోజుల్లో వంద మంది రైతులు చనిపోయారని ఆయన అన్నారు.
రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమంటూ సమస్యను అప్పటి ప్రభుత్వాలపై నెట్టేస్తే ఇప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉండడమెందుకని ఆయన ప్రశ్నించారు. ఈనెల 19కి ముందు చనిపోయిన రైతులకు పరిహారం అందదని చెబుతున్న ప్రభుత్వం గతంలో చేసిన ఆయా నీటి పారుదల కాంట్రాక్టు పనులకు ధరలు పెంచి రూ. 3వేల కోట్లను చెల్లించాలని చూస్తోందని, ఈవిషయంలో లేని నిబంధనలు రైతుల విషయంలో ఎందుకని ఆయన రావుల అన్నారు.

కాంట్రాక్టర్లయితే కమీషన్లు ఇస్తారని, అదే రైతులైతే ఇవ్వరు కాబట్టి వారికి అన్యాయం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే కల్తీకల్లు నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
కాగా, నల్గొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే, సిపిఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యామ్నయ మార్గాలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలన్నారు.
అలాగే నల్గొండ జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ప్రభుత్వం కోరితే వారి వివరాలను అందజేస్తామన్నారు.












Click it and Unblock the Notifications