షి క్యాబ్స్: ఆపద వస్తే మహిళలు పానిక్ బటన్ నొక్కితే చాలు (పిక్చర్స్)
హైదరాబాద్: భాగ్యనగరంలో షి క్యాబ్లో ప్రయాణించే మహిళలు... అందులోని పానిక్ బటన్ నొక్కితే అక్కడకు పోలీసులు వచ్చేలా ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు షి క్యాబ్స్ను ప్రారంభించింది.
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వీటిని ప్రారంభించారు. భాగ్యనగరంలో మహిళలు, ఉద్యోగినులు, విద్యార్థినుల భద్రత కోసం ఈ క్యాబ్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీఏ కార్యాలయంలో పదిమంది మహిళలకు షి క్యాబ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి, పోలీసు అధికారి స్వాతి లక్రా మాట్లాడారు. మహిళల భద్రత లక్ష్యంగా వీటిని ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ఒక్కో ట్యాక్సీకి 45 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. మహిళా డ్రైవర్ల ఆత్మస్థైర్యం పెంపుకు పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
షీ క్యాబ్స్ను జిపిఎస్తో అనుసంధానం చేస్తామన్నారు. తద్వారా భద్రత చర్యలు తీసుకుంటామన్నారు. షి క్యాబ్లో ఎక్కిన మహిళలు ఆపద వస్తే కార్లలోని పానిక్ బటన్ నొక్కితో వెంటనే పోలీసులు వస్తారని చెప్పారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలకు షి క్యాబ్స్ ఉపకరం అన్నారు.