పోతే పొమ్మనండి: ప్రతిపక్షాలపై విరుచుకుపడిన తలసాని
హైదరాబాద్: హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికల విషయంలో కోర్టు పోతామంటే పొమ్మనండి, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆ అవకాశం ఉంటుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన మంగళవారం మీడియా వద్ద విరుచుకుపడ్డారు.
తాము ప్రజాస్వామ్యబద్దంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఏవైనా అభ్యంతరాలుంటే కోర్టును అశ్రయించవచ్చునని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో విపక్షాలు రాద్ధాంతం చేసేందుకు యత్నిస్తున్నాయని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప
ద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు తాము ముందుకొస్తుంటే ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. రిజర్వేషన్లు, షెడ్యూల్ లాంటి నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం, కార్పోరేషన్ అధికారులే చూసుకుంటారని ఆయన చెప్పారు. ధైర్యముంటే ఎన్నికల్లో పోటీచేసి ఎదుర్కొనాలే తప్ప పనికిరాని వ్యవహారాలు తగవన్నారు.
ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలకు సమాన అవకాశాలు ఉంటాయన్నారు. ప్రజలకు ఎవరిపై విశ్వాసం ఉంటే వారికే ఓట్లేసి గెలిపిస్తారని అంటూ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు.
పార్కుల అభివృద్ధితో..
పార్కుల అభివృద్ధితో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాదులోని సంజీవయ్య పార్కులో రోజ్ గార్డెన్ను మంత్రులు కెటి రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లతో కలిసి ఆయన మంగళవారంనాడు ప్రారంభించారు.
నగరంలో మరిన్ని పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాదు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.