తెలంగాణా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర 15వ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా శాసనమండలి, శాసనసభను ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21ను ఆదివారం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో మంత్రి ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించనున్నారు.

ప్రారంభమైన తెలంగాణా బడ్జెట్ సమావేశాలు
నేడు ప్రారంభమైన తెలంగాణా శాసనసభా సమావేశాలలో ఉదయం 10 గంటలకు గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు అయ్యారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్ ప్రసంగ ప్రతిని అందజేయగా ఆమె అసెంబ్లీలో ప్రసంగించారు.

తొలిసారి అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గవర్నర్ ప్రసంగం లో ప్రధానంగా పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్లో బాధ్యతలు చేపట్టిన గవర్నర్ తమిళిసై తొలిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలిసారి తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తమిళి సై తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని తన ప్రసంగంలో వివరించారు .

సీఎం కేసీఆర్ కృషి తో ప్రగతి పథంలో తెలంగాణా
సీఎం కేసీఆర్ కృషి తో ప్రగతి పథంలో తెలంగాణా ప్రయాణిస్తుందని తమిళి సై పేర్కొన్నారు. తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతుందని గవర్నర్ తమిళి సై తెలిపారు . ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని, నాడు తెలంగాణా కోసం పోరాటం చేసిన నేతనే ఇప్పుడు మన సీఎం కేసీఆర్ అని గవర్నర్ పేర్కొన్నారు.
Recommended Video


ప్రణాళికబద్దంగా చిత్తశుద్ధితో పని చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరేళ్లు ప్రణాళికబద్దంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణా రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.

కరెంట్ కష్టాలు లేవు .. కొత్త రెవెన్యూ పాలసీ ఆలోచన
తెలంగాణ ఏర్పాటైన కొత్తలో విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవని కానీ ఇప్పుడు కరెంట్ కష్టాలు లేవని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు గవర్నర్. తెలంగాణా రైతాంగానికి రైతుబంధు, రైతు బీమాతో భరోసా కల్పించామని గవర్నర్ తమిళిసై తెలిపారు.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల పట్టణాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. పారిశ్రామిక ప్రగతి సాధించే దిశగా పయనం సాగిస్తుందని, అవినీతి రహిత నూతన రెవెన్యూ పాలసీ తీసుకురానుందని గవర్నర్ తమిళిసై తెలిపారు .

నిరుపేదల కోసం పలు సంక్షేమ పథకాలు
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్లు , బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ. 1,00,016 ఇస్తున్నామన్నారు . కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని పేర్కొన్నారు. సాగునీటి రంగంలోనూ ప్రగతి సాధించామని , తెలంగాణా రాష్ట్రం ముందంజలో ఉండేలా సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని గవర్నర్ తన ప్రసంగం ద్వారా చెప్పారు.












Click it and Unblock the Notifications