తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల: జులైలోనే
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. జులై 14 నుంచి ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు జులై 14, 15న.. ఇంజినీరింగ్ అభ్యర్థులకు జులై 18, 19, 20వ తేదీల్లో ఎంసెట్ నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్నందున.. జులైలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ను జులై 13న నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ప్రవేశపరీక్షలను 23 రీజినల్ సెంటర్ల పరిధిలో 105 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. దరఖాస్తు గడువు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్లు సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కాగా, ఈ పరీక్షలను 28 రీజనల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.