వ్యాక్సిన్ తీసుకోకుంటే నో రేషన్, నో పింఛన్: ఆ వార్తలు నమ్మొద్దు; తెలంగాణా డీహెచ్ శ్రీనివాస రావు యూటర్న్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే లబ్ధిదారులకు ఇచ్చే రేషన్ ను, పింఛన్ ను నిలిపివేస్తామని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందరు నవంబర్ 1వ తేదీ లోగా వ్యాక్సిన్ తీసుకోవాలని లేకుంటే వ్యాక్సిన్ తీసుకోని కుటుంబాలపై వేటు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే రాష్ట్ర ప్రజలలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లింకేంటి అని ప్రజల నుండి ప్రశ్నలు వెల్లువగా మారాయి. వ్యాక్సిన్లు తీసుకోని వారిలో వ్యాక్సిన్ల పై అవగాహన కల్పించాలని, అప్పటికీ వ్యాక్సిన్లు తీసుకోకుంటే ఇంటింటికీ వ్యాక్సిన్ సర్వే నిర్వహించి వ్యాక్సిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్న ప్రజలు తెలంగాణా ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకుని వెళితేనే రేషన్ ఇస్తానని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు.
అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు బయటకు రాలేదని త్వరలో సీఎం కేసీఆర్ దీనిపై ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు స్పందించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే రేషన్, పించన్ ఇస్తామని,తీసుకోని వారికి నవంబరు 1 నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. వైద్య ఆరోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అసలు అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఉదయం చేసిన ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావుపై సీరియస్ అయ్యారని సమాచారం. ఆ కారణంగానే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్ మరో తాజా ప్రకటన చేసి అలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ వెల్లడించారు. తప్పుడు వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన వెల్లడించారు.