కొద్ది గంటల్లో సంచలనం, ప్రధాన వ్యక్తుల అరెస్ట్: టీ-టీడీపీ కొత్తకోట
హైదరాబాద్: ఓటుకు నోటు, ట్యాపింగ్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడిని రాజేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ వద్ద ఆధారాలున్నాయని, ఆ ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వమే కూలవచ్చునని ఏపీ మంత్రులు చెప్పి సంచలనం సృష్టించారు.
మంగళవారం రాత్రి తెలంగాణ టీడీపీ నేత కొత్తకోట దయాకర రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి మరికొద్ద్ది గంటల్లో ఒక సంచలనం జరుగుతుందని అన్నారు.
గత 48 గంటలుగా రెండు, మూడు ఛానళ్లలో చంద్రబాబుకు నోటీసులు ఇస్తారని, అరెస్ట్ చేస్తారంటూ అభూత కల్పనలు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళపరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.

మరికొద్ది గంటల్లో ట్యాపింగ్కు సంబంధించి ఇద్దరు ఐపీఎస్, ఒక ఐఏఎస్ అధికారితో పాటు ఇద్దరు ప్రధాన వ్యక్తులు అరెస్ట్ కానున్నారని, వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, వీరిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం అరెస్టు చేసి జైలుకు పంపుతారన్నారు.
ఇప్పటివరకు ఓపికతో వేచి చూశామని, ఆధారాల సేకరణ పూర్తయిందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, వారిపై చట్టబద్ధంగా కేసులు నమోదు చేయడమే కాకుండా వారి అరెస్ట్కు రంగం సిద్ధమైందని, ఈ విషయంలో వెనక్కిపోయే ప్రసక్తి లేదని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ఐఏఎస్, ఇద్దరు ఏపీఎస్లు, ఈ కేసుకు కేంద్ర బిందువు అయిన అత్యంత ప్రధానమైన వ్యక్తి, మరో ప్రధానమైన వ్యక్తి ప్రమేయం ఉందని, ఆ ఐదుగురిని అరెస్టు చేస్తామని వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఆధారాలను ప్రజల ముందు ఉంచుతామని, కోర్టుకు సమర్పిస్తామన్నారు.


Click it and Unblock the Notifications