జయసుధ సైకిలెక్కడం వెనుక... కార్తిక రెడ్డి!: ఏ రాష్ట్ర టిడిపిలో అంటే.. (పిక్చర్స్)
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ కాంగ్రెస్ నేతలు తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే జయసుధ కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారని తెలుస్తోంది. ఆమె ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా తనను పరిగణనలోకి తీసుకోకపోవడం, తన వ్యతిరేక కార్తిక రెడ్డి వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ నుంచి పోటీచేసి గెలిచిన జయసుధ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.
తర్వాత ఆమె తెరాసలో చేరతారనే ప్రచారం జరిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నేతలు బుజ్జగించటంతో ఆమె కాంగ్రెస్లోనే ఉంటానని ప్రకటించారు. ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక పార్టీ తనను ఆహ్వానించలేదని ఆమె ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది.
ఆమె వ్యతిరేకవర్గానికి చెందిన వారికి కార్పొరేటర్ టికెట్లు దక్కాయి. ఈ జాబితా చూసిన జయసుధ వెంటనే కాంగ్రెస్ను వీడాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. కాగా, జయసుధ పార్టీని వీడినా తమకు వచ్చే నష్టమేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
సైకిల్ ఎక్కిన జయసుధ
సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ శనివారం సాయంత్రం టిడిపిలో చేరారు. ఆమె తన భర్త నితిన్ కపూర్, ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణతో కలిసి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక నివాసానికి వచ్చారు.
సైకిల్ ఎక్కిన జయసుధ
జయసుధకు సీఎం చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జయసుధ దంపతులు ముఖ్యమంత్రిని మాలతో సత్కరించారు. తర్వాత చంద్రబాబు ఇంటి బయట జయసుధ మీడియాతో మాట్లాడారు. 1999లో తాను టిడిపి తరపున ప్రచారం చేశానని గుర్తు చేసారు.
సైకిల్ ఎక్కిన జయసుధ
రాజకీయాల్లోకి రావాలని అప్పట్లో అనుకోలేదని, కొన్ని కారణాల వల్ల 2009 ఎన్నికల్లో పోటీ చేశానని, తానెంతగానో అభిమానించే నాయకుడు చంద్రబాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పానన్నారు. ఆయన హైదరాబాద్ను హైటెక్ సిటీగా తీర్చిదిద్ది, ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు.
సైకిల్ ఎక్కిన జయసుధ
హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి కారణం చంద్రబాబేనని, ఆంధ్రప్రదేశ్నూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. చంద్రబాబుకు అండగా ఉంటూ తెలుగువారందరికీ సేవ చేయాలని పార్టీలోకి వచ్చానని తెలిపారు.
సైకిల్ ఎక్కిన జయసుధ
మీరు చేరింది తెలంగాణ టిడిపిలోనా, ఏపీ టిడిపిలోనే అని విలేకరులు ప్రశ్నించగా... తెలుగువారందరికీ సేవ చేసేందుకు తాను పార్టీలో చేరానని జయసుధ బదులిచ్చారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేస్తారా అని అడగ్గా... చేయాల్సి వస్తే తప్పక చేస్తానని, చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటానన్నారు.