మహబూబాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటనలో ఉద్రిక్తత; మెడికల్ కాలేజీ భూనిర్వాసితుల అరెస్ట్
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో మహబూబాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు.
ఆపై మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్న మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. బోధన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ, జిల్లా ఆసుపత్రిని 350 పడకలుగా అప్ గ్రేడ్ చేసి అనంతరం వైద్యాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉంటే మహబూబాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో బాబు నాయక్, సంక్రియా తండాలకు చెందిన గిరిజన రైతులు మహబూబాబాద్ జిల్లాలో నిర్మించతలపెట్టిన మెడికల్ కళాశాలకు తమ భూములను ప్రభుత్వం తీసుకుందని, తమకు న్యాయం చెయ్యకపోతే మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకుని తీరుతామని మెడికల్ కళాశాల భూనిర్వాసితులు స్పష్టం చేశారు. దీంతో బాబు నాయక్, సంక్రియా తండాల గిరిజనులు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. వారిని పోలీస్ స్టేషన్ కు రావాలని హుకుం జారీ చేశారు. పోలీసులు అరెస్టు చేయడం కోసం ప్రయత్నించడంతో తమను అరెస్టు చేయవద్దంటూ రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు.
మొత్తం తొమ్మిది మంది గిరిజన రైతులను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక మెడికల్ కళాశాలకు భూములు ఇచ్చిన భూ నిర్వాసితులు హరీష్ రావు పర్యటన ను అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో మహబూబాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటన లో ఏం జరుగుతుందో అన్న ఆందోళన చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం హరీష్ రావు పర్యటన సజావుగా సాగడం కోసం అన్ని చర్యలు తీసుకుంటుంది.