కోట్లు వచ్చాయంటూ.. లక్షలు కాజేస్తున్న నైజీరియన్ల అరెస్ట్: ఢిల్లీ పోలీసుల ప్రశంస(ఫొటోలు)
హైదరాబాద్: మీ మొబైల్ నెంబర్ రూ. కోట్లలో లాటరీ గెలుచుకుందని సందేశాలు పంపించి.. ఆకర్షితులైన వారి నుంచి అందినకాడికి దండుకుంటూ నైజీరియన్లు మోసాలను కొంతపుంతలు తొక్కిస్తున్నారు. ఓ కేసు నిమిత్తం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేసిన ముగ్గురు నేరగాళ్లను విచారించిన క్రమంలో వారు చేసిన మోసాలు బయటపడ్డాయి.
నిందితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లను ఢీకోడ్ చేయగా దిమ్మతిరిగే వాస్తవాలు బహిర్గతమయ్యాయి. లాటరీ తరహా మోసాల్లో భాగంగా నేరగాళ్లు.. 99,584మందికి సందేశాలు పంపించినట్లు వెల్లడైంది. వారిలో ఎంత మంది నేరగాళ్లలో వలలో చిక్కారనే విషయంపై ప్రస్తుతం సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుల్లో ఒకరు ఆ దేశ పోలీసు అధికారి కావడం గమనార్హం.
నైజీరియన్ మోసాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. జూన్ మొదటి వారంలో హైదరాబాద్లోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళ(37) మొబైల్ ఫోన్కు తెల్లవారు జామున మీరు సామ్సంగ్ లాటరీ గెల్చుకున్నారని మెసేజ్ వచ్చింది. ఈ లాటరీతో మీకు 3.60 కోట్ల రూపాయలు గెల్చుకున్నారని వివరించారు. ఉదయం సమయంలో లాటరీ గెల్చుకున్నారనే వచ్చిన సందేశంతో ఆమె తనకు అదృష్టం వరించిందని మురిసిపోయింది.
మెసేజ్లో వచ్చిన మెయిల్ అడ్రస్సుకు ఆమె తన పూర్తి వివరాలను పంపింది. ఆ మరుసటి రోజు తిరిగి ఆమెకు లాటరీ గెల్చుకున్నారంటూ నిర్ధారణ పత్రాన్ని పంపారు. మీకు భారతదేశ ఆర్బీఐ అధికారుల నుంచి ఫోన్ వస్తుంది.. వారికి మీ వివరాలను వెల్లడిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ నగదును మీ అకౌంట్లోకి చేరుతుందని వివరించారు.
ఆ మరుసటి రోజు [email protected] పేరుతో మరో మెయిల్ వచ్చింది. దీంట్లో మీరు గెల్చుకున్న లాటరీని ధ్రువీకరిస్తున్నాం. డబ్బు కోసం మీరు కొంత నగదను డిపాజిట్ చేయాలంటూ బ్యాంక్ అకౌంట్ల వివరాలను వెల్లడించారు. మరింత నమ్మకానికి గురైన మహిళ ఏకంగా రూ. 15.50 లక్షలను డిపాజిట్ చేసింది.
త్వరలోనే ఇన్కం టాక్స్, యాంటీ టెర్రరిస్టు సర్టిఫికెట్, కస్టమ్స్ క్లియరెన్స్లు చేసుకుని నగదు మీ అకౌంట్కు చేరుతుందని తెలిపారు. మరో రెండు రోజుల తర్వాత మరికొన్ని డబ్బులు డిపాజిట్ చేయాలని ఒత్తిడి పెంచారు. ఆమెకు అనుమానం వచ్చి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. మహిళకు వచ్చిన మెయిల్స్ పరిశీలించిన వారు ఇది నైజీరియన్ ఫ్రాడ్గా నిర్ధారించారు.
సైబర్ క్రైం ఏసీపీ జయరాం సారథ్యంలో ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్, ఎస్ఐ విజయ్ వర్థన్ కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. మహిళకు వచ్చిన మెయిల్స్ ట్రాక్ చేసిన పోలీసులకు ఐపీ అడ్రస్సు లొకేషన్ న్యూఢిల్లీ మహావీర్నగర్ చిరునామాను చూపించింది.
దీంతో అక్కడి వెళ్లిన సైబర్ క్రైం బృందం నిందితులు ఓడిడి ఓనోరైడ్ వాల్ష్(31), ఎన్కీమాకర్ అంథోని(33), గాస్పోల్ ఇకెన్న(28)ను అరెస్టు చేసి తీజ్ హాజరీ కోర్టులో హాజరుపర్చి బుధవారం నగరానికి తీసుకువచ్చి రిమాండ్ చేశారు.
వీరి వద్ద నుంచి రూ. 1.50 లక్షల నగదు, 5 ల్యాప్టాప్లు, 10 మొబైల్ ఫోన్లు, 8 ఇంటర్నెట్ డెటా కార్డులు, 53 యాక్టీవ్ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరి ల్యాప్టాప్లు, ఫోన్లు విశ్లేషించడంతో ఈ తరహ లాటరీ మెయిల్స్, ఎస్ఎంఎస్లను మొత్తం లక్షమందికి పంపారని పోలీసులు గుర్తించారు.
కాగా, సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఓడిడి ఓనోరైడ్ నైజీరియాలో పోలీసు అధికారిగా పని చేశారని పోలీసులు గుర్తించారు. ఎస్ఐ స్థాయి హోదాలు బాధ్యతలను నిర్వహిస్తున్న ఓనోరైడ్ మరో ఇద్దరు నిందితులతో కలిసి 2013లో భారత దేశానికి వచ్చినట్లు వారి వద్ద ఉన్న పత్రాలు ధ్రువీకరిస్తున్నాయి.
రెండు నెలల బిజినెస్ వీసా మీద వచ్చిన వీరు.. ఆ తర్వాత దొంగ వీసాలు తయారు చేసుకుని వాటిని పాసుపోర్టుల మీద అతికించి పోలీసులను బురిడీ కొట్టిస్తూ రెండేళ్లుగా ఇక్కడే మకాం వేశారు. ఓనోరైడ్ నైజీరియాలో పోలీసు అధికారిగా పని చేశాడా? లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు మన పోలీసులు నైజీరియా ఎంబసీకి లేఖ రాయనున్నారు.
తెలంగాణ పోలీసులకు ఢిల్లీ పోలీసుల ప్రశంస
ఇది ఇలా ఉండగా, ఈ ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు పలుసార్లు తనిఖీలు చేసినా.. వారు అక్రమంగా ఉంటున్నారనే విషయాన్ని ధ్రువీకరించలేకపోయారు. అయితే తెలంగాణ పోలీసులు అరెస్టుకు ముందు రోజు కూడా ఢిల్లీ పోలీసులు వీరి పాసుపోర్టులు పరిశీలించారు. అయినా అందులో ఉన్న వీసా స్టాంపింగ్స్ ఫేక్ అని గుర్తించలేకపోయారు.
సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత పాసుపోర్టులో ఉన్న వీసా స్టాంప్స్ అన్ని నకిలీవని తేల్చడంతో దేశ రాజధాని పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. మన పోలీసులు వారి దృష్టికి తీసుకువెళ్ళగా మాకు వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో పసిగట్టలేకపోయామన్నారు. తెలంగాణ పోలీసుల పని తీరును ప్రశంసించారు. వీరి నకిలీ వీసాల నేరానికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖలోని ఎఫ్ఆర్ఆర్ఓకు పంపిస్తామని సైబర్క్రైం పోలీసులు తెలిపారు.