కేంద్రం అండతో విర్రవీగొద్దు, మాతో పెట్టుకుంటే..: ఏపీకి తుమ్మల హెచ్చరిక
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అండగా ఉందనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విర్రవీగొద్దని, తమతో వివాదాలు పెట్టుకుంటే ఏపీకే నష్టమని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు సరికాదన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో ఉన్న మైత్రితో ఏపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని వివాదం చేస్తోందన్నారు. విభజన చట్టం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. కానీ ఈ విషయంలో సెంట్రల్ వాటర్ కమిషన్కు, కృష్ణా రివర్ బోర్డుకు, కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాస్తూ రాద్దాంతం చేస్తోందన్నారు.
ఏపీలో జరిగే రాజకీయాల కోసం తెలంగాణను ఇబ్బంది పాలు చేయాలని చూడవద్దని, అలా చేస్తే మీరే నష్టపోతారని హెచ్చరించారు. మీ చిల్లర రాజకీయాలకు తాము ప్రాజెక్టులు అపేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు.
నాగార్జున సాగర్లో వాటాను వాడుకోలేకపోయామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బ్రిజేషన్ ట్రైబ్యునల్ వద్ద వాదనలు వినిపిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల నీటి పంపకాలు, వివాదాలపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారని, మరోసారి మాట్లాడేందుకు కేసీఆర్ సిద్ధమన్నారు.
వివాదాలు మంచిది కాదని, సున్నితమైన నదీజలాల పంపకాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
గోదావరి, కృష్ణా నదీ జలాల పంపకాల విషయంలో బచావత్ అవార్డు నిర్ణయాలకు లోబడి ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపులు జరిగాయన్నారు. దుమ్ముగూడెం, కాళేశ్వరం, డిండి, పాలమూరు, ప్రాణహిత - చేవెళ్లలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులే అన్నారు. ఏపీ కావాలనే వివాదాలు సృష్టించే కుట్ర చేస్తోందన్నారు.
కృష్ణానది యాజమాన్య బోర్డు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని, లేని అధికారాలను చలాయిస్తున్నదని తుమ్మల ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేయాలని కోరుతూ ఆ బోర్డు ముసాయిదా నోటిఫికేషన్ను జలమంత్రిత్వ శాఖకు పంపడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు.
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణ విజ్ఞప్తిని పరిశీలించి, ఇంకా అవార్డు జారీ చేయలేదని ఈ సమయంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేస్తే అరవై ఏళ్లుగా తెలంగాణ రైతులకు జరిగిన అన్యాయాన్ని కొనసాగించడమే అవుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టులు ఆగవన్నారు.