ఛీ ఛీ .. చలివేంద్రంలో కుండను కూడా వదలరా .. మీ దరిద్రం దొంగలెత్తుకెళ్ళ !
కాదేదీ దొంగతనానికి అనర్హం అని నిరూపించారు ఓ ఇద్దరు దొంగలు. బైక్ పై వచ్చి పెద్ద స్కెచ్ గీసి మరీ చోరీ చేశారు . ఇంతకీ వాళ్ళు చోరీ చేసింది ఏమిటో తెలిస్తే మీరు షాక్ తింటారు . తెలంగాణా జిల్లాలలోనే ఈ దౌర్భాగ్యపు ఘటన జరిగినట్టుగా సమాచారం . ఈ చోరీ ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది. బైక్ పై వెళ్లి మరీ చుట్టూ చూసి కొద్ది సేపు తటపటాయించి మరీ దొంగతనం చేశారు ఇద్దరు దొంగలు .
ఇక ఇంతకీ వారు చేసిన దొంగతనం ఏమిటంటే చలివేంద్రంలో పెట్టిన కుండను గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేశారు. రాత్రి సమయంలో బైక్ పై వెళ్ళిన ఇద్దరు చలివేంద్రం దగ్గర ఆగారు. అందులో ఒకడు చలివేంద్రంలోకి వెళ్లి అందులో ఉన్న కుండలోని నీళ్ళు పక్కన పారబోశాడు. ఆ దారిన వేరే వాహనాల రాకపోకలను చూసి కాసేపు ఆగారు.
ఆ తరువాత బైక్ స్టార్ట్ చేసి కుండతో వెళ్లిపోవాలనుకున్నారు. కానీ బైక్ స్టార్ట్ కాలేదు. చాలా సేపు బైక్ స్టార్ట్ చెయ్యటానికి టాటాలు పడ్డాడు ఒక దొంగ. ఈ లోగా ఇంకొక కుండ దొంగ కుండ పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళబోయాడు . ఈలోగా బైక్ స్టార్ట్ అయ్యింది. ఇంకేం కుండతో ఎంచక్కా చెక్కేశారు సదరు కుండ దొంగలు . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది . ఇక ఈ దొంగతనం చూసినోళ్ళు ఓర్నీ కుండలను కూడా వదలరా అంటూ అవాక్కవుతున్నారు.