చంద్రబాబు, కెసిఆర్ మంచి స్నేహితులు: కవితను ఆకాశానికెత్తిన ఉమాభారతి
న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యురాలు కల్వకుంట్ల కవితపై ప్రశంసల వర్షం కురిపించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోని భూముల వినియోగానికి సంబంధించిన వివరాల కోసం కవిత అడిగిన ప్రశ్నపై ఉమాభారతి స్పందించారు. ‘స్పీకర్గారూ, టిఆర్ఎస్ సభ్యురాలు కవిత మేధావి, విజ్ఞానవంతురాలు, అత్యంత ప్రతిభావంతురాలైన ప్రజాప్రతినిధి' అని ఉమాభారతి ఆమెకు కితాబు ఇచ్చారు.
కవిత అడిగిన పూర్తి సమాచారాన్ని ఆమెకు అందజేస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న జల వివాదానికి సంబంధించిన విచారణ జరపాలని కవిత విజ్ఞప్తి చేయగా వీలైనంత త్వరగా ఈ విచారణ జరిపిస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారు.
తన విజప్తి మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ముఖాముఖి చర్చలు జరిపి కొన్ని సమస్యలను పరిష్కరించుకున్నారని ఆమె తెలిపారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వనరుల శాఖల అధికారులు ఢిల్లీకి వచ్చి కేంద్ర జల వనరుల శాఖ అధికారులతో సంయుక్త చర్చలు జరిపి కొన్ని సమస్యలను పరిష్కరించుకున్నారని ఉమాభారతి చెప్పారు.
తెలంగాణ, ఏపీ సీఎంలు కే చంద్రశేఖర్రావు, చంద్రబాబు గతంలో మంచి స్నేహితులని, రెండు రాష్ర్టాల మధ్య సమస్యలను పరిష్కరించుకోగల సమర్థులన్నారు. జియోగ్రాఫికల్ వ్యవస్థ (జీఐఎస్) ద్వారా దేశంలోని అన్ని నదులకు సంబంధించిన భూగణాంకాలు, సమాచార వ్యవస్థ కేంద్రానికి అందుతుందన్నారు. అయితే ఆ సమాచారం కేవలం ఆయా నదుల వరదలకు సంబంధించింది మాత్రమేనన్నారు. రాష్ర్టాల ద్వారా అందుతున్న వివరాలను జీఐఎస్ ద్వారా సరిపోల్చుకుంటున్నారా? అని కవిత అడిగారన్నారు. కాని దురదృష్టవశాత్తు కేంద్రం వద్ద ఆ వ్యవస్థ లేదని ఉమాభారతి సమాధానమిచ్చారు.
కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రానికి టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తిచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి నిరుడు రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్రం పెండింగ్లోనే పెట్టిందని గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. సీఎం కే చంద్రశేఖర్రావు కూడా పలుమార్లు దీనిపై గుర్తుచేశారన్నారు. ఏడాది దాటినా పెండింగ్లో ఉంచారని, ఎప్పుడు అవకాశం కల్పిస్తారని కేంద్ర జల వనరులశాఖ మంత్రి ఉమాభారతిని ప్రశ్నించారు.
అయితే 2015- 16లో రెండు రాష్ర్టాల మధ్య జలాల పంపిణీపై ఏకాభిప్రాయ సాధనకు చొరవ తీసుకున్నందుకు ఉమాభారతికి కవిత కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ సభ్యురాలు కవిత చాలా ముఖ్యమైన అంశం లేవనెత్తారన్నారు. తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీ సమస్య పరిష్కారానికి కేంద్రం సానుకూలంగా ఉన్నదన్నారు. ట్రిబ్యునల్ బయట సమస్య పరిష్కారానికి శాయశక్తులా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదనిచెప్పారు.