Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీఎస్సీ సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని విజయ రహస్యం ఇదే!

క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళిక ఇవి ఉంటే ఎటువంటి పనినైనా ఈజీగా చేయవచ్చు, ఎంతటి గొప్ప విజయాలను అయినా ఈజీగా సాధించవచ్చు. సామాన్య కుటుంబంలో పుట్టి గొప్ప గొప్ప విజయాలను సాధించిన స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు. ఇక ఆ కోవకు చెందిన యువతి వరంగల్ జిల్లాకు చెందిన ఇట్టబోయిన సాయి శివాని. upsc సివిల్స్ లో 11వర్యాంకు సాధించి విజయం సాధించిన సాయి శివాని ప్రయాణంపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.

ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని
ఇట్టబోయిన సాయి శివాని, చిన్ననాటి నుండి కలెక్టర్ కావాలన్న కోరికతో, ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం అవిశ్రాంతంగా శ్రమ చేసి ఫైనల్ గా అనుకున్నది సాధించింది. సివిల్స్ ఫలితాలలో వరంగల్ కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభను చాటింది. తెలుగు రాష్ట్రాల టాపర్ గా నిలిచింది. ఎలాంటి కోచింగ్ లేకుండా, ఇంట్లోనే తనకు తాను ప్లాన్ చేసుకుని ప్రణాళికబద్ధంగా చదివింది.

UPSC Civil Services 11th ranker Sai Shivani inspiring success story

సివిల్స్ లో ర్యాంక్ సాధించిన సాయి శివాని
సివిల్స్ లో ర్యాంక్ సాధించాలని ఐదేళ్లు తపన పడిన సాయి శివాని, తాను అనుకున్నది సాధించింది. వరంగల్ నగరంలోని శివనగర్ వాసవి కాలనీలో నివాసముండే సాయి శివాని కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఇట్టబోయిన రాజు మెడికల్ రిప్రజెంటేటివ్, తల్లి రజిత గృహిణి. సాయి శివానికి చెల్లెలు సూర్య సఖి, తమ్ముడు సాయి శివ ఆదిత్య ఉన్నారు. సాయి శివాని చిన్ననాటి నుండి చదువులో ఎప్పుడు ముందుండేది.

పట్టు వదలకుండా సివిల్స్ కు ప్రిపేర్
చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలన్న కోరిక ఆమె మనసులో బీజంగా ఉండేది. అది కాస్త బీటెక్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ వైపు ఆమెను నడిపించింది. సివిల్స్ తొలి ప్రయత్నం ఆమెను నిరాశకు గురిచేసింది. ప్రిలిమ్స్ లోని ఫలితం ఆశించిన విధంగా రాకపోవడంతో సాయి శివానితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా నిరాశపడ్డారు. అయినప్పటికీ మళ్లీ పట్టు వదలకుండా సాయి శివాని సివిల్స్ కు ప్రిపేర్ అయింది.

బయట ప్రపంచానికి దూరంగా గదికే పరిమితమై చదువుకున్న సాయి శివాని
ఇంటి వద్దనే చదువుకుంటూ ఆన్లైన్లో తనకు అవసరమైన అంశాలను తెలుసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ అయింది. మొత్తం మూడు సంవత్సరాల కాలంలో సివిల్స్ లో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించి అందరితో శభాష్ అనిపించుకుంది. బయట ప్రపంచానికి దూరంగా, సరదాలను, సంతోషాలను పక్కనపెట్టి, సోషల్ మీడియా ప్రసక్తే లేకుండా తదేకదీక్షతో ఒక గదికే పరిమితమై సాయి శివాని చదువుకుంది.

గది గోడల నిండా స్పూర్తినిచ్చే రాతలు
పదో తరగతి పిల్లవాడు సైతం మొబైల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్న నేటిరోజుల్లో ఇప్పటివరకు మొబైల్ ఫోన్ కూడా లేకుండా సాయి శివాని తన చదువును సాగించింది. ఒకే గదిలో ఉంటూ తన ఆహారం, నిద్ర అన్నీ చదువుగానే మార్చుకుంది. ఆమె చదువుకున్న గది సాక్షాత్తు సరస్వతీ నిలయంలా కనిపిస్తుంది. గది గోడల నిండా ఎక్కడ చూసినా తనకు స్ఫూర్తినిచ్చే రాతలను, తన ప్రణాళికలను రాసి పెట్టుకుంది.

తెలంగాణా గ్రూప్ వన్ పరీక్షలోనూ 21వ ర్యాంకు
సాయి శివాని చదువుకున్న గది మొత్తాన్ని పరికించి చూస్తే చాలు ఆమెకు ఉన్న పట్టుదల ఏ పాటిదో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. upsc సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని, ఇదే నెలలో తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన గ్రూప్ 1లో రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు సాధించి అందరిని అబ్బురపరిచింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన స్కాలర్షిప్ సాయి శివాని లక్ష్యానికి మరింత బాసటగా నిలిచింది.

తల్లిదండ్రుల సహకారం నిరుపమానం
సాయి శివాని లక్ష్యసాధన కోసం తల్లిదండ్రులు చేసిన కృషి కూడా కొనియాడతగింది. సాయి శివాని కోరికను, తమ కోరిక గా మార్చుకొని తల్లిదండ్రులు ఆమెకు సహకారాన్ని అందించారు. మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తూనే, సాయి శివాని చదువుకు కావలసిన పూర్తి సహకారాన్ని తండ్రి రాజు అందించారు.

తండ్రి తనకు ఆదర్శం అంటున్న సాయి శివాని
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అవేవీ సాయి శివాని చదువుకు ఇబ్బంది కాకుండా తండ్రి రాజు సహకరించిన తీరు ప్రస్తుతం ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతుంది. ఇక సాయి శివాని కూడా తనకు తన తండ్రి ఆదర్శమని, కష్టపడి పనిచేసే ఆయన స్వభావమే తనను ముందుకు నడిపించింది అని చెబుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను విజయం సాధించ గలిగానని ఆమె అంటోంది.

ఎంతో కష్టపడి చదివేదని చెప్పిన తల్లి రజిత
చిన్ననాటి నుండి తమ కుమార్తె ఎంతో బాగా చదువుకునేదని, కలెక్టర్ కావాలన్న తన కోరికను తీర్చడం కోసం తమకు చేతనైన సహకారాన్ని అందించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రతిరోజు 12గంటలకు పైగానే కష్టపడి చదివేదని, సాయి శివాని కష్టాన్ని తాము కళ్ళారా చూసామని తల్లి రజిత చెప్పారు. తొలిసారి ప్రిలిమ్స్ లో అనుకున్న ఫలితం రాకపోవడంతో చాలా బాధపడ్డామని, అయినప్పటికీ మళ్లీ సాయి శివానీని ప్రోత్సహించి తనకు అండగా నిలిచామని చెప్పారు.

కూతురి విజయం పట్ల తండ్రి రాజు హర్షం
చిన్నప్పటి నుంచి ప్రతి తరగతిలోనూ ఎప్పుడు సాయి శివాని ఫస్ట్ ర్యాంకర్ అని, ఇప్పుడు జాతీయస్థాయిలో సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తండ్రి రాజు తెలిపారు. తమ కుమార్తె సాయి శివాని కోరిక మేరకు సివిల్స్ ప్రిపేర్ కావడానికి కావలసిన సహాయ సహకారాలు అందించానని తెలిపారు. ఏదైనా సాధించాలన్న సాయి శివాని పట్టుదల ఈరోజు తనను అందరూ గుర్తించేలా చేసిందని సంతోషం వ్యక్తం చేశారు.

వరంగల్ నగరవాసుల హర్షం
ఇక వరంగల్ నగరానికి సివిల్స్ లో దేశంలోనే 11వ ర్యాంకు సాధించి ఎంతో గుర్తింపు తీసుకువచ్చిన సాయి శివానిని స్థానికులంతా ప్రశంసిస్తున్నారు. ఇంటికి వచ్చి మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాకతీయ రుద్రమదేవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఓరుగల్లుకు వన్నె తెచ్చిన సాయి శివాని చేసిన కృషిని నగర ప్రముఖులు కొనియాడుతున్నారు.

ప్రజలకు అందుబాటులో పని చెయ్యటమే లక్ష్యం
చిన్నప్పటినుంచి కన్న కలను నెరవేర్చుకుని, సివిల్స్ లో టాప్ ర్యాంకును సాధించిన ఈ భావి ఐఏఎస్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కరించడానికి తన సాయి శక్తుల పని చేస్తానని చెబుతున్నారు. అంతేకాదు అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయకుండా, యువత తాము ఎంచుకున్న రంగంలో ఎదగాలని, ఉన్నతిని సాధించాలని సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+