భార్య ఓ జిల్లాకు, భర్త ఓ జిల్లాకు... ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్; మండిపడిన విజయశాంతి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తమకు ఆప్షన్ ప్రకారం బదిలీ చేయండని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
317 జీవో అనే పంజాలో చిక్కుకుని ఉద్యోగులు విలవిలాడుతున్న దుస్థితి
బదిలీలకు సంబంధించిన 317 జీవో అనే పంజాలో చిక్కుకుని విలవిలాడుతున్న దుస్థితి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావడం అత్యంత హేయం అని విజయశాంతి అభిప్రాయపడ్డారు. బదిలీల కోసం ఉద్యోగులు పెట్టుకున్న ఆప్షన్లు,ఉద్యోగ సంఘాల ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో బదిలీలు చేపట్టి,ఉద్యోగుల్లో సీనియర్, జూనియర్ అనే చీలిక తేవడం దారుణమని పేర్కొన్నారు. బదిలీల పేరుతో ఉద్యోగులను, ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు.

దుర్మార్గపు నియంత పాలన అంతం ఖాయం
సీఎంకేసీఆర్ ఏడేండ్ల పాలనలో తమ కనీస డిమాండ్లను కూడా తీర్చటం లేదనే ఆగ్రహంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారని విజయశాంతి పేర్కొన్నారు. బదిలీలు మాత్రం ఆగవద్దంటూ బలవంతంగా అధికారులకు హుకుం జారీ చేసి, ఉద్యోగులను అష్టకష్టాల పాలుచేస్తూ వారి ఉసురు తీస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. ఈ దుర్మార్గపు నియంత పాలనను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతమొందించడం ఖాయం అంటూ విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

తొమ్మిది మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా మారని కేసీఆర్ తీరు
తెలంగాణ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్న విజయశాంతి కేసీఆర్ సర్కార్ వేధింపులకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే వస్తాయి అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకొని, లాఠీలకు పనిచెబుతూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులను, ఉపాధ్యాయులను, ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు అని విజయశాంతి ధ్వజ మెత్తారు. ఇప్పటికే ఈ అనాలోచిత ప్రభుత్వ తీరును తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్ మాత్రం ప్రాణాలు పోతే పోనీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

భర్తను ఓ జిల్లాకు, భార్యను ఓ జిల్లాకు బదిలీ చేస్తున్న సర్కార్
భార్యభర్తలుగా ఉన్న ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకోకుండా భర్తను ఓ జిల్లాకు, భార్యను మరో జిల్లాకు బదిలీ చేస్తూ ఆటలు ఆడుతున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కేసీఆర్ సర్కార్ పైప్రత్యక్ష ఉద్యమానికి పూనుకుని ప్రగతి భవన్ను ముట్టడించి తమ గోడును, ఆవేదనను తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే వారిని అడుగడుగునా అణిచి వేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications