Warangal east: అక్కడ హేమాహేమీలపై హిజ్రా పోటీ.. తొలిసారి పార్టీ నుండి టికెట్!!
ఒకప్పుడు హిజ్రాలు అంటే సమాజంలో చిన్న చూపుకు గురై ఏ రంగంలోనూ రాణించలేక అట్టడుగు వర్గంగా నిలిచారు. కానీ ఇప్పుడు హిజ్రాలు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. చదువైన, వ్యాపారమైన, రాజకీయమైనా సరే మేము సైతం అంటూ హిజ్రాలు ముందుకు వస్తున్నారు. సమాజంలో ఒకరిగా కలిసిపోయే ప్రయత్నం చేస్తున్న హిజ్రాలు రాజకీయంగాను వడివడిగా అడుగులు వేస్తున్నారు.
తాజాగా తెలంగాణ శాసనసభకు వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలలో తొలిసారి ఒక ట్రాన్స్ జెండర్ ఒక పార్టీ టికెట్ పై పోటీ చేయబోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారధ్యంలో బిఎస్పీ తెలంగాణలో రానున్న ఎన్నికలలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. తాజాగా 43 మందితో ప్రకటించిన రెండో జాబితాలో వరంగల్ తూర్పు స్థానాన్ని ఒక హిజ్రా కు కేటాయించారు.

వరంగల్ తూర్పు నుండి చిత్తారపు పుష్పిత లయకు బిఎస్పి టికెట్ ను కేటాయించింది. వరంగల్ కరీమాబాద్ లో నివసించే పుష్పిత లయ ఒక ట్రాన్స్ జెండర్. బిఎస్సి లో యాక్టివ్ గా పని చేస్తున్న ఆమెకు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇచ్చారు. దీంతో తమ హిజ్రా కమ్యూనిటీకి టికెట్ రావడంతో హిజ్రాలు సంబరాలు జరుపుకుంటున్నారు. బీఎస్పీ కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే బిఎస్పి నుండి ఎన్నికల బరిలోకి దిగనున్న పుష్పిత లయ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, బిజెపి అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావులతో తలపడనున్నారు. ఇక టిక్ తనకు టికెట్ రావడం పై స్పందించిన పుష్పిత లయ తనను గెలిపిస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో తన మార్క్ ను చూపిస్తాను అన్నారు.
విద్యావంతురాలిగా తానేమిటో నిరూపించుకుంటానని పేర్కొన్నారు. తనను నమ్మి తనకు టికెట్ కేటాయించిన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హిజ్రా పుష్పిత లయ కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తానికి హేమాహేమీలు పోటీలో ఉన్న వరంగల్ తూర్పులో ఒక హిజ్రా వారిపై పోటీ చెయ్యటం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications