నిత్య పెళ్లి కొడుకు: 3 రాష్ట్రాల్లో మూడు పెళ్లిళ్లు.. మరో పెళ్లికి సిద్దపడటంతో వెలుగులోకి!
నిజామాబాద్: జిల్లాలో ఓ నిత్య కొడుకు పెళ్లి బాగోతం వెలుగుచూసింది. తెలంగాణలో ఇద్దరు మహిళలను, మహారాష్ట్రలో ఒకరిని, ఆంధ్రప్రదేశ్లో మరో మహిళను పెళ్లి చేసుకున్న ఇతను.. ఇటీవల కేరళ యువతితో మరో పెళ్లికి సిద్దపడ్డాడు. ఇటీవలే అతని పెళ్లిళ్ల బాగోతాన్ని గుర్తించిన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు డొంకంతా కదిలింది.
ఎవరితను?:
నిజామాబాద్ పట్టణానికి చెందిన పవన్కుమార్ ఛత్రే.. 2010లో మహారాష్ట్రలోని టెంబర్ ప్రాంతానికి చెందిన ఐలాబాయిని మొదట వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నిజామాబాద్ లోనే కాపురం పెట్టాడు. రెండేళ్ల తర్వాత అక్కడినుంచి నాందేడ్ వెళ్లిపోయారు.
ఒకరికి తెలియకుండా ఒకరిని:
నాందేడ్ వెళ్లిపోయిన తర్వాత.. మొదటి భార్యకు తెలియకుండా 2015లో నిర్మల్ జిల్లా గొల్లమాడ గ్రామానికి చెందిన దీపను పవన్ కుమార్ వివాహం చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బోథ్లో ఆమెతో కాపురం పెట్టాడు.
ఆమెతో కాపురం చేస్తూనే.. 2017లో విజయవాడ చెన్నూర్ గ్రామానికి చెందిన రాణిని పెండ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం ఆమెను చెన్నూరులోనే ఉంచాడు. ఈ విషయం దీపకు తెలియదు.
ఇలా వెలుగులోకి:
ఒకరికి తెలియకుండా ఒకరిని.. మొత్తం ముగ్గురిని పెళ్లి చేసుకున్న పవన్ కుమార్.. ఇటీవలే కేరళకు చెందిన మరో యువతిని నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
ఇదిలా ఉంటే, భర్త పవన్ కుమార్ వేధింపులపై బలాభాయి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకుల కోసం కోర్టులో దావా కూడా వేసింది. ఇదే క్రమంలో ఇటీవల ఆమె అత్తగారింటికి వెళ్లగా.. పవన్ మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్టు స్థానికుల ద్వారా తెలిసింది.
దీంతో తనకు జరిగిన అన్యాయంపై ఐలాభాయి ఐద్వా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లతను ఆశ్రయించింది. పవన్ పెళ్లిళ్ల బాగోతం గురించి చెప్పడంతో బోథ్లోని పవన్ రెండో భార్యను కూడా వారు సంప్రదించారు. అప్పటిదాకా భర్త పెళ్లిళ్ల బాగోతాలు తెలియని ఆమె షాక్కి గురైంది.
భార్యల ధర్నా:
మంగళవారం ఐద్వా ప్రతినిధులతో కలిసి ఐలాబాయి, దీప నిజామాబాద్ లోని భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. వీరి ధర్నా గురించి తెలుసుకుని విజయవాడలో ఉంటున్న మూడవ భార్య రాణి కూడా నిజామాబాద్కు బయలుదేరినట్లు సమాచారం. బాధితులు ధర్నాకు దిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
పరారీలో నిత్య పెళ్లి కొడుకు:
భార్యల ధర్నా విషయం వెలుసుకుని పవన్కుమార్ పరారయ్యాడు. అతని తండ్రి చంద్రకాంత్ కూడా పరారీలో ఉన్నాడు. తల్లి పద్మావతి ఒక్కరే ఇంటి వద్ద ఉన్నారు. కాగా, బాధితుల నుంచి పెళ్లి సమయంలో సుమారు రూ.40లక్షల వరకు వసూలు చేశారని, ఆ డబ్బు తిరిగి ఇప్పిస్తే బాధితులకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఐద్వా ప్రతినిధులు తెలిపారు.