తిరుపతి ఉపఎన్నిక- ఈసీ అసాధారణ నిర్ణయం- పంచాయతీ, మున్సిపల్ పోరే కారణం
వచ్చే నెల 17న జరిగే తిరుపతి ఉపఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరిస్తున్న ఎన్నికల అధికారులు.. పోలింగ్ను కూడా పూర్తి స్ధాయిలో జరిగేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ అసాధారణ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని ఎన్నికల్లో వాడిన ఈ విధానం ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలో వాడాలని సీఈసీ నిర్ణయించడం వెనుక ఆసక్తికర కారణాలున్నాయి.
తిరుపతి ఉపఎన్నికకు ఈసీ ఏర్పాట్లు
తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన లోక్సభ సీటుకు వచ్చే నెల 17న ఉప ఎన్నిక జరగబోతోంది. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ అయింది. టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి నామినేషన్ కూడా దాఖలు చేశారు. వైసీపీ, బీజేపీ-జనసేన అభ్యర్ధులు కూడా త్వరలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అసలే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం, మరోవైపు ముదురుతున్న ఎండల నేపథ్యంలో ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది.
తిరుపతి ఓటర్ల కుడిచేతికి సిరా
సాధారణంగా స్ధానిక ఎన్నికలైనా, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలైనా ఓటర్లకు ఎడమ చేతి వేలికి సిరా గుర్తు వేస్తుంటారు. ఇండెలిబుల్ ఇంక్తో వేలిపై గుర్తు వేయడం ద్వారా సదరు ఓటరు ఓటు వేసినట్లు తెలియడం కోసం దీన్ని వాడతారు. ఇలా చేయడం ద్వారా దొంగ ఓట్లను నివారించడంతో పాటు అనవసర వివాదాలకు తావు లేకుండా ఈసీ ఏర్పాట్లు చేస్తుంటుంది. కానీ తిరుపతిలో మాత్రం అసాధారణంగా ఓటర్ల కుడిచేతి వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని రిటర్నింగ్ అధికారులకు సీఈసీ నుంచి ఉత్తర్వులు అందాయి.
కుడి చేతికి సిరా నిర్ణయం ఎందుకంటే ?
తిరుపతి ఉపఎన్నికలో ఓటర్ల కుడి చేతికి సిరా గుర్తు వేయాలని సీఈసీ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కీలక కారణముంది. ఏపీలో తాజాగా పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగాయి. వీటిలో ఓటర్ల ఎడమ చేతి వేళ్లకు సిరా గుర్తు వేశారు. అవి చెరిగిపోవాలంటే కనీసం 15 నుంచి నెల రోజుల సమయం పడుతుంది. మరికొందరికి నెల రోజుల కంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. దీంతో తిరుపతి ఉపఎన్నికలో అనవసర వివాదాలను నివారించేందుకు వీలుగా కుడి చేతికి సిరా గుర్తు వేయాలని సీఈసీ నిర్ణయం తీసుకుంది.