తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక .. నేటి నుండి నామినేషన్లు .. మొదలైన పొలిటికల్ హీట్
తెలుగు రాష్ట్రాల్లో మరో ఉప ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల కమీషన్ ముహూర్తం పెట్టింది . తిరుపతి ,నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ హడావుడి పడుతున్నాయి. ఇక నేటి నుంచి నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 30వ తేదీ వరకు నామినేషన్లను వేయనున్నారు.
ఇక మార్చి 31వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతుంది.
ఏప్రిల్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే రెండవ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించేందుకు రెడీ చేస్తున్నాయి .
ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ నుండి పనబాక లక్ష్మి ఎన్నికల బరిలోకి దిగనుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ గురుమూర్తి ఎన్నికల బరిలోకి దిగనున్నారు . ఇక బీజేపీ జనసేన పొత్తుల లో భాగంగా తిరుపతిలో బిజెపి నుండి అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు ఎన్నికల బరిలోకి దించాలన్న చర్చ జరుగుతుంది. మొత్తానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికపై దృష్టిసారించారు. నేటి నుండి నామినేషన్లు కూడా కొనసాగనున్న కారణంగా ఏపీలో తిరుపతి వేదికగా పొలిటికల్ హీట్ మొదలైంది.