నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల; వారికీ ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు!!
కలియుగ వైకుంఠం, దేవదేవుడు కొలువైన ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది. ఎప్పుడెప్పుడా అని భక్తులు ఆశగా ఎదురు చూస్తున్న అంగ ప్రదక్షిణం టోకెన్లు జారీకి టిటిడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేయనున్నారు. ఇక ఇదే సమయంలో నేడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ ద్వారా వృద్ధులు, వికలాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను కూడా విడుదల చేయనున్నారు.
తిరుమల స్వామివారి అంగ ప్రదక్షిణ టోకెన్లను ముందుగా వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు. ఈ అంగ ప్రదక్షిణ స్త్రీలు, పురుషులు ఇద్దరూ చేయవచ్చు. స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో సుపధం దగ్గరకు వెళ్లి స్వామివారి బంగారు బావి నుండి స్వామివారి హుండీ వరకు అంగ ప్రదక్షిణ చేస్తారు. తిరుమల శ్రీవారి భక్తులు అంగ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ తిరుమల వెంకటేశ్వరుడి కృపాకటాక్షాలు మెండుగా లభిస్తాయి అని భావిస్తారు. ఇక అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులను ధరిస్తే మంచిది. అంగ ప్రదక్షిణ చేసిన వారికి స్వామి వారి దర్శనం త్వరగా లభిస్తుంది. ఇక భక్తులు అంగ ప్రదక్షిణ చెయ్యటం కోసం టికెట్లను ప్రతీనెలా టీటీడీ విడుదల చేస్తుంది.
ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రోజు స్వామివారిని 58,965 మంది భక్తులు దర్శించుకున్నారు. వారంతా తిరుమల శ్రీవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2.5కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇదిలా ఉంటే నిన్న తిరుమల స్వామివారికి 25 వేల 113 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా భక్తుల కోరిక మేరకు వర్చువల్ సేవ టికెట్లు ఆన్లైన్ సేవలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఇప్పటికే వెల్లడించారు.
ఇక వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కూడా సమయం మార్చడంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ నిర్ణయం తిరుమల స్వామి దర్శనానికి వచ్చిన వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాబోయే వేసవికాలంలో మూడు నెలపాటు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, భక్తుల రద్దీ దృష్ట్యా విఐపి సేవా దర్శనానికి వచ్చేవారి రెఫరల్స్ బాగా తగ్గించాలని కోరారు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి.