నిమ్మగడ్డ ఆఫీసులో వాస్తు మార్పులు- ఆయన లేనప్పుడే- ఎవరి ఆదేశాలో తేల్చేందుకు విచారణ...
ఏపీ ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చీ రాగానే కొరడా ఝళిపించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత తాజాగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ... తన కార్యాలయంలో వాస్తు మార్పులపై మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టడమే కాదు ఇందుకు కారకులెవరో తేల్చాలంటూ విచారణకు ఆదేశించారు. దీంతో ఇప్పుడు బాధ్యులైన అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అసలే ప్రభుత్వంపై కాక మీదున్న నిమ్మగడ్డ తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియక వారు ఆందోళనలో ఉన్నారు.

నిమ్మగడ్డ ఆఫీసులో వాస్తు మార్పులు..
ఈ ఏడాది మార్చి నెలలో కరోనా కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా వేశాక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ ఎన్నికల వాయిదా తర్వాత ప్రక్రియను పర్యవేక్షించారు. ఆ తర్వాత నిమగడ్డను తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం, ఆయన దీనిపై కోర్టుల్లో న్యాయపోరాటం చేసి తిరిగి బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. అయితే ఈ మధ్య కాలంలో విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పలు వాస్తు మార్పులు జరిగాయి. నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు చేపట్టకముందే ఇవి జరిగిపోయాయి.

సమస్యల నివారణకేనంటూ...
ఎన్నికల కమిషనర్ గా పదవి కోల్పోవడం, ఆ తర్వాత చోటు చేసుకున్న వరుస ఘటనల నేపథ్యంలో తిరిగి బాధ్యతలు చేపట్టబోతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, తాను విజయవాడ రాకముందే కార్యాలయంలో వాస్తు మార్పులు చేయించారనే ప్రచారం జరిగింది. మీడియాలో జరిగిన ఈ ప్రచారంపై బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. అసలు తన ఆదేశాలు లేకుండా తన కార్యాలయంలో వాస్తుమార్పులు ఎందుకు జరిగాయని ఆరా తీశారు. ఇందుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో తేల్చాలని నిర్ణయించారు. ముందుగా ఎన్నికల కమిషనర్ గా రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న తనకు వాస్తు మార్పులతో సంబంధం లేదని, ఇలాంటి వ్యవహారాల్లో తాను తటస్ధంగా ఉంటానని నిమ్మగడ్డ తాజాగా ఓ ప్రెస్నోట్ విడుదల చేశారు.

వాస్తు ఆదేశాలపై విచారణ...
తన కార్యాలయంలో తాను లేనప్పుడు వాస్తు మార్పులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎందుకోసం ఈ మార్పులు చేయాల్సి వచ్చింది, ప్రత్యేకంగా ఏమైనా కారణాలున్నాయా అనే అంశాలు తేల్చేందుకు నిమ్మగడ్డ విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతుందని, మీడియా కూడా ఈ విషయాన్ని గుర్తించాలని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఇది పూర్తయి బాధ్యులెవరో తేలితే వారిపై చర్యలు తీసుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయన బాధ్యతలు చేపట్టిన రోజు అధికారులు సహకరించలేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తు మార్పుల వ్యవహారం ఎవరి తలకు చుట్టుకుంటుందో తెలియక సిబ్బంది తలపట్టుకుంటున్నారు.
Recommended Video

మధ్యలో కనగరాజ్ చేయించారా ?
ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చాక ఆయన తిరిగి ఆఫీసుకు రాలేదు. ఆ తర్వాత జస్టిస్ కనగరాజ్ ఎన్నికల కమిషనర్గా హడావిడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన స్ధానిక ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు చేపట్టాలో తేల్చేందుకు అధికారులతో కొన్ని సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో ఆయన కూడా వాస్తు మార్పులు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఎక్కడా ఆధారాల్లేనట్లు తెలుస్తోంది. అయితే నోటి మాట ద్వారా ఏమైనా మార్పులకు సంకేతాలు ఇచ్చారా అన్నది తేలలేదు. ఆయన కాకపోతే అధికారులు మాత్రమే ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు వాస్తు మార్పుల వ్యవహారం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications