విజయ్ దర్బార్ పేరుతో దందాలు; అంకుశంలో రామిరెడ్డి గతే సాయిరెడ్డికి : బుద్దా వెంకన్న సంచలనం
టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర బందిపోటు విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించిన బుద్ధా వెంకన్న చంబల్ లోయలో ఉండాల్సిన విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో తిరుగుతున్నారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో విజయసాయిరెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్న బుద్ధా వెంకన్న విశాఖలో ఉన్న ఫ్యాక్టరీలపై విజయ సాయి రెడ్డి ఫైన్ లు వేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు.
సాయిరెడ్డికి సహకరించిన అధికారులపై చర్యలుంటాయి
2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బుద్ధా వెంకన్న. అప్పుడు విజయసాయిరెడ్డి అక్రమాలపై ఆయనకు సహకరించిన అధికారులపై చర్యలు ఉంటాయని బుద్దా వెంకన్న హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నేతలు కబ్జా చేసిన భూములను మళ్లీ బాధితులకు తిరిగి ఇస్తామని పేర్కొన్నారు బుద్దా వెంకన్న. విశాఖపట్టణం నాశనం చేయడానికి విజయ సాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షసుడికి రక్తం మీద, విజయసాయి రెడ్డి ధనం మీద వ్యామోహం ఉంటుందని బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు.
విజయ్ దర్బార్ పేరుతో సెటిల్మెంట్లు, దందాలు
విజయసాయిరెడ్డి విజయ్ దర్బార్ పేరుతో సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బుద్ధ వెంకన్న విశాఖపట్నంలో కొండలు, ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు బుద్దా వెంకన్న. టూరిస్టు మంత్రికి తెలియకుండా సాయి రెడ్డి టూరిస్ట్ గెస్ట్ హౌస్ ను పగలగొట్టి తన కుమార్తెకు కట్టబెట్టుకుంటున్నారని బుద్ధ వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 వ సంవత్సరంలో జరిగే ఎన్నికలలో అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే విజయసాయి రెడ్డికి పడుతుందని బుద్ధ వెంకన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
దోచుకోవటమే వైసీపీ నేతల పని
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైన్ షాపుల్లో కట్టే డబ్బులన్నీ తాడేపల్లికి వెళుతున్నాయి అంటూ బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. ఇక విశాఖ నుండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయ శంఖారావం పూరిస్తారు అంటూ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. దోచుకోవడమే పనిగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బుద్ధ వెంకన్న. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి పై టిడిపి సీనియర్ నాయకులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
త్వరలో ఉత్తరాంధ్ర సమస్యలపై సమావేశం : నిమ్మకాయల చినరాజప్ప
ఈనెల 20వ తేదీన లోకేష్ పర్యటన ఉందని అనకాపల్లి లో పార్టీ కార్యాలయం ప్రారంభం సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. త్వరలోనే ఉత్తరాంధ్ర సమస్యలపైన సమావేశం అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు విఫలం చెందారని విమర్శించారు. దోచుకోవడమే పనిగా వైసిపి పనిచేస్తుందని మండిపడిన చిన రాజప్ప ఈనెల 26వ తేదీన విద్యుత్ సమస్యపై నిరసన కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు.
Recommended Video
విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలు
మొన్నటికి మొన్న ఏపి డ్రగ్స్ వ్యవహారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి కి అన్నీ తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే విజయసాయిరెడ్డి సైలెంట్ గా ఉంటున్నారు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు విశాఖలో సాయి రెడ్డి భూముల కబ్జాలపై ఫోకస్ చేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.