సీఎం జగన్ కు రాజధాని రైతుల అల్టిమేటం .. ప్రకటనపై డెడ్ లైన్
రాజధాని ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం ఆ తరువాత జరిగిన పరిణామాలు రాజధాని రైతులకు ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ నిర్ణయం కూడా అదేనా అనే భావన కలిగిస్తున్నాయి. మంత్రి బుగ్గన ప్రకటనతో రాజధాని రైతుల్లో మళ్లీ అలజడి రేగింది.
రాజధాని లేదని అవమానిస్తారా?: ప్రధాని మోడీకి కూడా అంటూ లోక్సభలో గల్లా జయదేవ్
మంత్రి బుగ్గన వ్యాఖ్యలతో భగ్గుమన్న రాజధాని రైతులు
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అమరావతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. మొన్నటిదాకా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలతో రైతులకు టెన్షన్ పట్టుకుంటే, రాజధాని అమరావతి నిర్మాణానికి డబ్బుల్లేవని, అదీగాక నిర్మాణం అంత అవసరం లేదని తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటన చేయటంతో రైతులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇక రోజుకో వ్యాఖ్య చేస్తూ రాజధాని అమరావతి వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యం కాదని చెప్పటంతో రాజధాని అమరావతి రైతులు భగ్గుమన్నారు.
రాజధానిపై నిపుణుల కమిటీ వేయటాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళిన రైతులు
అసలు రాజధాని అమరావతి ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా నిపుణుల కమిటీ పర్యటించి అభిప్రాయాలు సేకరించటంపైనే హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని అమరావతి అంశంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సిఫారసులు చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ గతనెల 13న రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక వైసీపీ సర్కార్ జారీ చేసిన జీవో 585ను సవాల్ చేస్తూ చాలా మంది రాజధాని రైతులు కోర్టుకు వెళ్ళారు.దీనిపై కోర్టులో వాదనలు సైతం కొనసాగుతున్నాయి.
బుగ్గన వ్యాఖ్యలతో సీఎం జగన్ కు అల్టిమేటం జారీ చేసిన రాజధాని రైతులు
ఇదే సమయంలో రాజధాని ఏర్పాటుపై నిపుణుల కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమ నివేదిక సిద్ధం చేసింది. నిపుణుల కమిటీ నివేదికపై క్యాబినెట్ లో చర్చ తర్వాత రాజధానిపై నిర్ణయం ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఈ లోపు బుగ్గన చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతులకు ఆగ్రహం తెప్పించాయి.రాజధాని నిర్మాణం తమ ప్రాధాన్యత ఎంతమాత్రం కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు బుగ్గన . లక్షల కోట్లు ఖర్చు చేసి నగరాలు నిర్మించే స్థోమత తమ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని తేల్చేశారు. దీంతో.. రాజధాని మీద జరుగుతున్న హాట్ చర్చకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇదే రైతుల ఆగ్రహానికి కారణం అయ్యింది. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డికి రాజధాని రైతులు అల్టిమేటం జారీ చేశారు.
అసెంబ్లీ సమావేశాలలో రాజధానిపై సీఎం ప్రకటన చెయ్యాలని డిమాండ్
తాజాగా రాజధాని కోసం గతంలో భూములు ఇచ్చిన రైతులు జగన్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఈ అసెంబ్లీ సమావేశాలలో సీం జగన్ ప్రకటన ఇవ్వాలని, అమరావతి నిర్మించే స్తోమత ప్రభుత్వానికి లేదని స్వయంగా మంత్రే ఒప్పుకోవడంపై రైతులు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలలోసీఎం జగన్ రాజధానిపై ప్రకటన చేయకుంటే, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని, నిరాహార దీక్షకు కూడా దిగుతామని హెచ్చరించారు.
Recommended Video
సీఎం ప్రకటన చెయ్యకుంటే అసెంబ్లీ ముట్టడి, నిరాహార దీక్షలు చేస్తామన్న రైతులు
తుళ్లూరు మండలం మందడం గచ్చు సెంటర్ వద్ద రైతులు సమావేశమై ఈ అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఉద్యమం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో 29 గ్రామాలకు చెందిన రాజధాని రైతులు పాల్గొన్నారు.ఇప్పటికే రాజధాని అమరావతి విషయంలో పలు మార్లు ఆందోళన చేసిన రైతులు రాజధాని అమరావతి మార్పు నిర్ణయాన్ని ఒప్పుకునేది లేదని తేల్చి చెప్తున్నారు.