ఆ ప్రాజెక్ట్ లు కొత్తవి కాదు .. మాట్లాడేందుకు మేం సిద్ధం .. కేంద్రమంత్రికి సీఎం జగన్ ప్రత్యుత్తరం
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖకు ప్రత్యుత్తరం ఇచ్చారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ నుండి స్పందన లేదంటూ ఈ నెల 7న తమకు రాసిన లేఖ సరికాదని ఆయన పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అజెండా పాయింట్లతో నాలుగవ తేదీన లేఖ కూడా పంపామని పేర్కొన్న జగన్ ఈ అంశాన్ని అధికారులు మీ దృష్టికి తీసుకు రాలేదని తెలుస్తోందని ప్రస్తావించారు.
Recommended Video
పొరుగు రాష్ట్రాల్లోలా ఏపీలో భారీ వసతులున్న ఆస్పత్రులు లేవు: కేంద్ర సహాయం కావాలన్న సీఎం జగన్
రాష్ట్రం తరపున మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం
రాష్ట్రం తరఫున మాట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న ఏపీ సీఎం జగన్ కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని, అవి పాతవేనని పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. కృష్ణానది జలాల వినియోగం విషయంలో 2015 సంవత్సరంలో జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణ, ఏపీ ల మధ్య అంగీకారం కుదిరిందని పేర్కొన్న ఆయన కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండబోవని పేర్కొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనపు ఆయకట్టు సాగులోకి రాదు
రాయలసీమ ఎత్తిపోతల పథకం కేవలం అనుబంధ ప్రాజెక్టు మాత్రమే అన్న సీఎం జగన్ ప్రస్తుతం ఉన్న కాలువల ద్వారానే అదనపు ఆయకట్టు ఈ పథకం కింద ఉందని లేఖలో స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదని, నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదని పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగం కోసమే ఎత్తిపోతలు చేపట్టామని, అంతకు మించి ఇది కొత్త ప్రాజెక్టు కాదని ఏపీ సీఎం జగన్ కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణాలో రూల్స్ కు భిన్నంగా ఆ ప్రాజెక్టుల నిర్మాణాలు
కొత్త ప్రాజెక్టులకు మాత్రమే నదీయాజమాన్య బోర్డు వద్ద అనుమతి తీసుకోవాలని విభజన చట్టంలో ఉందన్న జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అదేమీ లేకుండా నిర్మాణాలు చేపడుతుందని పేర్కొన్నారు. మొదట అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ రాష్ట్రం చెప్పిందని, కానీ అనంతరం దానిని అతిక్రమించి కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు.
తెలంగాణా ప్రాజెక్ట్ లపై సుప్రీం కు వెళ్ళాం
ఈ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో తాము పిటిషన్లు కూడా దాఖలు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని 2016 లోనే కేంద్రానికి సూచించిందని పేర్కొన్న సీఎం జగన్, మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసిందని, అపెక్స్ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోయిందని పేర్కొన్నారు .
సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించండి
మరోమారు అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని తాము కోరుతున్నామని తెలిపారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా జల వివాదాలు సమస్యలు పరిష్కారమవుతాయని భావించామని, కానీ ఆ సమావేశం జరక్కుండా ఆగిపోయిందని, తిరిగి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలని మేం కోరుతున్నామని పేర్కొన్నారు సీఎం జగన్.