విజయవాడలో నో నాన్ వెజ్ .. అమ్మితే కఠిన చర్యలే
కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. ఇప్పటికే 1016 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అంతటా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది . కేవలం విజయవాడలోనే అత్యధికంగా 100కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఇక ఈ నేపధ్యంలో విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో విజయవాడలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు . నగరంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు.
ఇక నగర వ్యాప్తంగా నాన్వెజ్ అమ్మకాలను నిషేధించారు. మాంసాహారాన్ని అమ్మరాదని, కొనరాదని నిషేధాజ్ఞలు విధించారు. చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహార విక్రయాలను పూర్తిగా నిషేధించిన జిల్లా అధికారయంత్రాంగం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా రహస్యంగా అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. క్రయ విక్రయాలకు సంబంధించి నిషేధంపై మైక్స్ ద్వారా ఇప్పటికే అన్ని డివిజన్లలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలు, వ్యాపారులందరూ మాంసాహారానికి దూరంగా ఉండాలని అధికారులు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.

ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక విజయవాడలో కేసులు బాగా పెరుగుతున్న నేపధ్యంలో కలెక్టర్ ఇంతియాజ్ మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చెయ్యాలని ఆదేశించారు. కొంతమంది ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడం వల్లే కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని అన్నారు. విజయవాడ కృష్ణలంకలో నమోదైన కేసులు కూడా ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. దయచేసి ప్రజలందరూ ఇళ్ల గడపను దాటి బయటకు రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరం హాట్స్పాట్గా మారిందని , ఇరుగు పొరుగు వారి ఇళ్లకు సైతం వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక మాంసాహారం వద్దని , నిత్యావసరాలకు మాత్రమే అనుమతి అని చెప్పారు. ప్రజలు, వాహనదారులు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన లేకుంటే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications