మూడు రాజధానుల ఏర్పాటు .. మండలి రద్దు జరిగి తీరుతుంది : రోజా
నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు రాష్ర్ట అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు . చంద్రబాబు ఎంత అడ్డు పడినా మూడు రాజధానులు ఆగవని, మండలి రద్దు కూడా ఆపలేరని రోజా ధీమా వ్యక్తం చేశారు . అమరావతి పై చంద్రబాబుకి చిత్తశుద్ది వుంటే అప్పుడే ఎందుకు నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదని ఆమె ప్రశ్నించారు. ఇవాళ ఆమె శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రోజా మాట్లాడారు. మూడు రాజధానులు ఏర్పాటు జరిగి తీరుతుందని , మండలి రద్దు అవుతుందని ఆమె పేర్కొన్నారు .
ఇక అంతే కాదు చైనాలో చిక్కుకున్న 58 మంది తెలుగు వాళ్ళని తీసుకురావడానికి జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీసిటీ నుంచి 58 మంది టీసీఎల్ కంపెనీ తరపున శిక్షణ కోసం చైనాలో వూహాన్ సిటీకి వెళ్లారు. ఐతే అక్కడ కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ వారిని వీలైనంత త్వరంగా ఇండియాకు తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇక తాజాగా ఉద్యోగుల తల్లిదండ్రులను కలిసిన రోజా సీఎం జగన్తో మాట్లాడినట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు. చిత్తూరు నుంచి 58 మంది వూహాన్కు వెళ్లారని, అక్కడ వారికి తిండి కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న రోజా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని, చైనాకు విమాన సర్వీసులను పునరుద్ధరించిన వెంటనే వారిని స్వస్థలాలకు తీసుకొస్తామని ఎమ్మెల్యే రోజా హామీ ఇచ్చారు.