దుర్గగుడి ఫ్లై ఓవర్ పై రెచ్చిపోయిన ఆకతాయిలు, తుపాకీతో రేసింగ్ స్టంట్స్; క్రిమినల్ కేసులు నమోదు
విజయవాడలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పైన ఇష్టారాజ్యంగా రేసింగ్ విన్యాసాలు చేస్తున్నారు. బైక్ పై నిలబడి గన్ తో కాల్చుతూ ఆకతాయిలు హల్చల్ చేస్తున్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పై రేస్ లకు పాల్పడుతూ వాహనదారులకు దడ పుట్టిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో బైక్ రేసర్ లపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
విజయవాడలో రెచ్చిపోతున్న ఆకతాయిలు .. దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై రేసింగ్ స్టంట్స్
విజయవాడలో ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరి పోతున్నాయి. హైదరాబాద్ తరహాలో విజయవాడలో కూడా బైక్ రేస్ ల జోరు కొనసాగుతోంది. ఇక బైక్ రేసర్ లకు దుర్గ గుడి ఫ్లైఓవర్ రేసింగ్ ప్లేస్ గా మారింది. తాజాగా ఇద్దరు యువకులు దుర్గగుడి ఫ్లై ఓవర్ పై బైక్ పై రేసింగ్ స్టంట్స్ చేశారు. కెటిఎమ్, పల్సర్ 220 బైక్ ల నెంబర్ ప్లేట్లు తీసేసి రోడ్లపై రచ్చ చేశారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పై నుండి వెళుతున్న వాహనదారులు వారి బైక్ స్టంట్స్ చూసి భయపడిపోయారు. ఇక ఫోటో షూట్ పేరుతో ఈ విన్యాసాలు చేసినట్లుగా గుర్తించారు. యువకులు బొమ్మ తుపాకీతో విన్యాసాలు చేశారని పోలీసులు చెప్తున్నారు.

సీసీ టీవీ ఫుటేజ్, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా రేసర్ల అరెస్ట్
సోషల్ మీడియాలో వైరల్ ఐన వీడియోల ఆధారంగా అందులో ఉన్న యువకుడిని అరెస్ట్ చేశామని, మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇదే సమయంలో దుర్గగుడి ఫ్లై ఓవర్ పై ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు బైక్ స్టంట్స్ చేస్తూ పట్టుబడ్డారని, వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పై స్టంట్లు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పిన ట్రాఫిక్ అడిషనల్ డిసిపి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా యువకులను గుర్తించామని పేర్కొన్నారు. గత ఏప్రిల్ నెలలో బైక్ పై స్టంట్స్ చేస్తున్న ఐదుగురు విద్యార్థులను పట్టుకున్నామని వెల్లడించారు.
బైక్ రేస్ లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు .. పోలీసుల వార్నింగ్
ఇదే సమయంలో విద్యార్థులు ఎవరూ బైక్ రేస్ లకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా బైక్ రేస్ లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్తున్నారు. ఇక నుంచి ఖాళీ రోడ్ లు, ఫ్లైఓవర్ ల పైనా పోలీసులు నిఘా పెడతామని చెబుతున్నారు. యువత రోడ్లపై స్టంట్స్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని పోలీసులు అంటున్నారు. ఖరీదైన బైక్స్ కొనివ్వటమే కాదు పిల్లలు ఏం చేస్తున్నారో కూడా గమనించాలని అంటున్నారు.
విజయవాడలో పెరిగిపోతున్న రేసింగ్ కల్చర్ .. కట్టడి చెయ్యాల్సిన అవసరం
హైదరాబాద్ లోనే కాకుండా, విజయవాడ కేంద్రంగా కూడా బైక్ రేసింగ్ కల్చర్ పెరిగిపోవడంతో చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. ఇకనుండి ఎవరైనా ఈ తరహా చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న హైదరాబాద్ లో అతి ఖరీదైన బైక్ లతో ట్యాంక్ బండ్ పై మితిమీరిన వేగంతో హంగామా సృష్టించిన రేసర్లు క్రింద పడడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా యువకుల్లో మార్పు రాని తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇక రేసింగ్ సమయంలో ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలే గాల్లో కలిసిపోయే ప్రమాదం లేకపోలేదు.












Click it and Unblock the Notifications