రెవెన్యూ శాఖలో అవినీతి ఎంతంటే .. సీఎం చెప్పినా సరే లెక్క చెయ్యనంత
తెలంగాణ రాష్ట్రంలో ఆ శాఖ పేరు చెప్తేనే అందరూ భయపడుతున్నారు. ఆ శాఖలో పని జరగాలంటే ఆమ్యామ్యాలు ముట్టాల్సిందే అంటూ బాహాటంగానే చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాట ని సైతం లెక్కచేయకుండా అవినీతి ఆ శాఖలో పెచ్చుమీరుతోంది. రెవెన్యూ శాఖకు అవినీతి మకిలి పట్టుకుంది. అమాయక ప్రజలు పీడిస్తూ, దొరికినంత దోచుకో అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు రెవిన్యూ అధికారులు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా రెవెన్యూ శాఖలో అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెవెన్యూ శాఖలో పెరుగుతున్న అవినీతి
తెలంగాణ సర్కార్ పేదల కోసం ప్రారంభించిన భూప్రక్షాళన అవినీతి అధికారుల జేబులు నింపుతోంది. భూప్రక్షాళన ఆసరాగా చేసుకొని అక్రమార్జనకు తెరతీశారు. లంచాల కోసం ప్రజలను వేధిస్తున్నారు. తాజాగా రెవెన్యూ శాఖలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. తహసిల్దార్ కి లంచం ఇవ్వాలంటూ వృద్ధ దంపతులు భూపాలపల్లిలో బిక్షాటన చేస్తే, వి ఆర్ వో కు లంచం ఇవ్వాలంటూ ములుగు వెంకటాపూర్లో రైతులు భిక్షాటన చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నడికుడ ఆర్ ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడితే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త పరిపాలన అధికారి 45 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు.

గత సంవత్సరం ఏసిబి దాడుల్లోనూ రెవెన్యూ ఉద్యోగులే ఎక్కువ
ఇక గత సంవత్సరం ఉమ్మడి వరంగల్ జిల్లా లో మొత్తం పదమూడు మందిని పట్టుకోగా అందులో ఒక్క రెవెన్యూ శాఖ నుండి ఎనిమిది మంది ఉద్యోగులు ఉండటం గమనార్హం. పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి, పాసుపుస్తకంలో తప్పొప్పులను సరిచేసి పేరు మార్చడానికి, సర్వే నెంబర్లను సవరించడానికి, కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, కల్యాణలక్ష్మి పథకం మంజూరుకు... ఇలా ప్రతీ సేవకు డబ్బులు దండుకుంటున్నారు. దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న చందంగా దోపిడీకి పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారులు .రెవెన్యూ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు సైతం కిందిస్థాయి అధికారుల ద్వారా వసూళ్ల పర్వాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో బాధితులు భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన లకు దిగుతున్నారు.

సీఎం మాటను లెక్కచేయని రెవెన్యూ అధికారులు.. ప్రక్షాళన చేయాలంటున్న ప్రజలు
ప్రభుత్వ శాఖల్లో లంచం అడిగిన వారిపై ఉక్కుపాదం మోపుతామని, ఏ పనికి లంచ అడగొద్దని, ఎవరూ కూడా అధికారులకు లంచాలు ఇవ్వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ రెవెన్యూ శాఖ అధికారులకు మాత్రం ముఖ్యమంత్రి మాట అన్నా లెక్క లేదు. సీఎం చెప్పినా పట్టించుకోని అధికార యంత్రాంగం తీరు ప్రజాగ్రహానికి కారణమవుతుంది. ఇప్పటికైనా రెవెన్యూ శాఖలో వేళ్ళూనుకున్న అవినీతిని అంతమొందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications