ఓటుకు నోటు.. సీఎం సీటుకు నోటు.. కాంగ్రెస్, బీజేపీలపై హరీశ్ రావు ఫైర్
విపక్షాలపై మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఓ పార్టీలో ఓటుకు నోటు ఉంటే... ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు ఉందని కామెంట్ చేశారు. పరోక్షంగా రేవంత్ రెడ్డి.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడారు. ఆ రెండు పార్టీలు ఇంతేనని ధ్వజమెత్తారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.102 కోట్లతో చేపట్టిన పలు పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ.2,500 కోట్లు ఇస్తే వస్తదట అని కామెంట్ చేశారు. కర్ణాటక బీజేపీ ఎంపీనే చెబుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరో మీకు తెలుసు అని మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి అని పేర్కొన్నారు. ఇలాంటి పార్టీలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని పథకాలను అమలు చేస్తుంది మన రాష్ట్రమేనని చెప్పారు. రైతుబంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి పలు పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. ప్రజల సంక్షేమమే తమకు ఇంపార్టెంట్ అని చెప్పారు. వారి కోసమే తాపత్రాయ పడుతున్నామని చెప్పారు. వాస్తవానికి ఇప్పట్లో ఎన్నికలు లేవు. కానీ అన్నీ పార్టీలు ఎన్నికల లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇటీవల ఓరుగల్లులో రాహుల్ గాంధీ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ మరునాడే మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించారు. దీంతోపాటు పెండింగ్ పనులను కూడా వీలయినంత త్వరగా పూర్తిచేసే పనిలో ప్రభుత్వం ఉంది.