నెలరోజుల్లో ఆక్రమణలు తొలగింపు.. టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు: వరంగల్ ముంపుపై సమీక్షలో కేటీఆర్
వరంగల్ నగరంలో వరదల పరిస్థితి పరిశీలించటానికి వచ్చిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు . రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. వరద నీటి ప్రవాహ నాలాలు, మురికి నీటి నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీని నియమించారు. భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

నిట్ లో అధికారులతో వరద పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష
వరదల వల్ల జరిగిన నష్టంపై అధికారులు పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం వరంగల్ నగరంలో పర్యటించిన కెటి రామారావు నిట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో పర్యటించిన సందర్భంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విషయం చెప్పారని నాలాలపై ఆక్రమణల వల్ల వరద బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని, జనావాసాలు జలమయమయ్యాయని చెప్పారని క్షేత్ర స్థాయిలో కూడా అదే కనిపించిందని పేర్కొన్నారు .

నాలాలపై ఆక్రమణల తొలగింపు విషయంలో రాజీ పడేది లేదు
నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమణలున్నాయి. వాటిని తక్షణం తొలగించాలి. ఈ విషయంలో రాజీ పడేది లేదు. రాజకీయ వత్తిళ్లు ఉండవు అని ఆయన స్పష్టం చేశారు . పెద్ద పెద్ద నిర్మాణాలు తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించాలని, ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పని వెంటనే ప్రారంభం కావాలని పేర్కొన్నారు. నెల రోజుల్లోగా మొత్తం ఆక్రమణలు తొలగించాలన్నారు . అవి అక్రమ నిర్మాణాలైతే నిర్ధాక్షిణ్యంగా తొలగించాలని పేర్కొన్నారు. పేదల ఇండ్లయితే, వారికి ప్రభుత్వం తరుఫున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి, రిజిస్ట్రేషన్ ఉన్న వారివైతే నష్ట పరిహారం చెల్లించి తొలగించాలని సూచించారు .

త్వరలో కొత్త మాస్టర్ ప్లాన్ , కొత్త మునిసిపల్ చట్టం .. నగరాభివృద్ధిపై దృష్టి
నాలాలపై ఆక్రమణలు తొలగిస్తూనే, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా వాటికి ప్రహారీ గోడలు(రిటైనింగ్ వాల్స్) నిర్మించాలి. ఎస్ఆర్ఎస్పి కాలువ ఆక్విడక్ట్ వద్ద కూడా పూడిక తీయాలి అని కేటీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పద్దతి ప్రకారం నగరాభివృద్ది జరగాలనే ఉద్దేశ్యంతోనే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చామని పేర్కొన్నారు . దానికి తోడు వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమయింది. ముఖ్యమంత్రి ఆమోదంతో త్వరలోనే దాన్ని ప్రకటిస్తామని చెప్పారు . వరంగల్ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు.

వరంగల్ వరదలపై సీఎం కేసీఆర్ ఆందోళన చెందారు
వరంగల్ లో భారీ వర్షాలు, వరదలు అనే సమాచారం సిఎం కు ఎంతో ఆందోళన కలిగించిందని అన్నారు . తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ దెబ్బతినకూడదని భావించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని పేర్కొన్నారు . ఏమాత్రం ప్రాణనష్టం కలగకుండా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మార్గ నిర్దేశం చేశారు.ముఖ్యమంత్రి సోమవారం స్వయంగా వరంగల్ రావాలనుకున్నారు. కానీ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో రాలేదని, ఇక్కడి పరిస్థితిని చూసి, సిఎంకు నివేదించామని చెప్పారు . తక్షణ అవసరాల కోసం రూ.25 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, అధికారులు పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత ఎన్ని నిధులు కావాలన్నాఇస్తామని చెప్పారని పేర్కొన్నారు .

టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
వరంగల్ నగరంలో నాలాలపై ఆక్రమణలు తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ హన్మంతు చైర్మన్ గా, పోలీస్ కమిషనర్ కో చైర్మన్ గా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జల వనరుల శాఖ ఎస్ఇ, వరంగల్ అర్బన్ ఆర్డీవో, నేషనల్ హైవేస్ అథారిటీ ఎస్ఇ సభ్యులుగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీనీ నియమిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ తెలిపారు .












Click it and Unblock the Notifications